త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత మాణిక్ సాహా ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం ఉదయం అగర్తలలోని స్వామి వివేకానంద మైదానంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో త్రిపుర గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్య మాణిక్ సాహా చేత సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. బీజేపీ అధిష్టానం ఏడాది క్రితమే మాణిక్ సాహాకు సీఎంగా బాధ్యతలు అప్పగించగా, తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-ఐపీఎఫ్టీ కూటమి గెలుపుతో మాణిక్ సాహా వరుసగా రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ, సిక్కిం సీఎం ప్రేమ్సింగ్ తమాంగ్, మణిపూర్ సీఎం ఎన్.బీరేన్ సింగ్ పలువురు బీజేపీ నేతలు, పలు పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎంగా బాధ్యతలు స్వీకరించిన మాణిక్ సాహాకు ప్రధాని మోదీ, బీజేపీ నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు.
మరోవైపు మాణిక్ సాహాతో పాటుగా మరో 8 మంది సభ్యుల మంత్రిమండలితో గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్య ప్రమాణం చేయించారు. మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో రతన్ లాల్ నాథ్, సుశాంత చౌదరి, సుధాంగ్షు దాస్, టింకు రాయ్, శుక్లా చరణ్ నోటియా, ప్రంజిత్ సింఘా రాయ్, బికాస్ దెబ్బర్మ మరియు సంతాన చక్మా ఉన్నారు. కాగా 3 కేబినెట్ బెర్తులు ఖాళీగా ఉంచారు. ముందుగా త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 60 స్థానాలకు గానూ బీజేపీ 32, సీపీఎం 11, కాంగ్రెస్ 3, ఐపీఎఫ్టీ 1, టిప్రా మోతా పార్టీ 13 స్థానాలు దక్కించుకున్నాయి. త్రిపుర సీఎం మాణిక్ సాహా టౌన్ బొర్ధోవలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆశిష్ కుమార్ పై 1,257 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
ఫలితాల అనంతరం త్రిపుర సీఎం రేసులో ప్రతిమా భౌతిక్ పేరు కూడా వినిపించింది. అయితే రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు తమ శాసనసభాపక్షనేతగా సాహా పేరును ఏకగ్రీవంగా ప్రతిపాదించడంతో, వరుసగా రెండోసారి త్రిపుర సీఎంగా పగ్గాలు చేపట్టేందుకు మాణిక్ సాహాకు మార్గం సుగమమైంది. ఈ క్రమంలోనే త్రిపురలో కొత్త బీజేపీ-ఐపీఎఫ్టీ ప్రభుత్వ ఏర్పాటు జరగగా, సీఎంగా మాణిక్ సాహా నేడు రెండోసారి బాధ్యతలు చేపట్టారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE