దేశంలో సుదీర్ఘ పూర్తిస్థాయి లాక్డౌన్ అనంతరం కేవలం కంటైన్మెంట్ జోన్లలో మాత్రమే జూన్ 30 వరకు లాక్డౌన్ పొడిగిస్తూ, అన్ లాక్ 1 ప్రణాళికను కేంద్రప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కరోనావైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జూన్ 9 నుండి 2 వారాల పాటుగా మళ్ళీ పూర్తిస్థాయి లాక్డౌన్ విధించాలని మిజోరాం ప్రభుత్వం సోమవారం నాడు నిర్ణయించింది. ఈ మేరకు మిజోరాం ముఖ్యమంత్రి జొరామ్తంగా ప్రకటన చేశారు. దేశంలో మిగిలిన రాష్ట్రాలు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో దశలవారీగా లాక్డౌన్ ఎత్తివేస్తూ, అన్లాక్ చేయడం ప్రారంభించిన క్రమంలో మిజోరాంలో మళ్ళీ పూర్తిస్థాయి లాక్డౌన్ విధించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యాచరణపై ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు, అన్ని సంబంధిత సంస్థలతో సంప్రదింపుల సమావేశం నిర్వహించిన అనంతరం మిజోరాం సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోకి వచ్చే ఎవరైనా సరే 21 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుందని సీఎం జొరామ్తంగా ప్రకటించారు. కాగా జూన్ 8, సోమవారం నాటికీ మిజోరాం రాష్ట్రంలో మొత్తం కరోనావైరస్ కేసుల సంఖ్య 42 కు చేరుకోగా, కరోనా వలన ఒకరు మృతి చెందారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu