బీజేపీ కీలక నేత, కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ బుధవారం తన పదవీకి రాజీనామా చేశారు. అలాగే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి రామచంద్ర ప్రసాద్ సింగ్ (ఆర్సీపీ సింగ్) కూడా తన పదవీకి రాజీనామా సమర్పించారు. రాజ్యసభ సభ్యులుగా ఉన్న వీరిద్దరి పదవీకాలం రేపటితో (జూలై 7, గురువారం) తో ముగియనుంది. ఇటీవల 15 రాష్ట్రాలకు సంబంధించి 57 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీకి బీజేపీ అధిష్ఠానం మరో అవకాశం ఇవ్వలేదు. అలాగే ఎన్డీఏ మిత్రపక్షమైన జనతాదళ్ (యునైటెడ్) నాయకుడైన ఆర్సీపీ సింగ్ కు కూడా ఆ పార్టీ అధినేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ మరొకసారి రాజ్యసభకు అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే తమ పదవీకాలం ముగియడానికి ఒకరోజు ముందుగానే తమ కేంద్ర మంత్రి పదవులకు వీరివురూ రాజీనామా చేశారు.
మరోవైపు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామాతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంతో పాటు పార్లమెంటులో బీజేపీకి ముస్లిం కమ్యూనిటీ ప్రాతినిధ్యం లేకుండా అయింది. అయితే నఖ్వీ భవిష్యత్తుపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీ ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ ఉప రాష్ట్రపతి పదవికి నఖ్వీ పేరును పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఉపరాష్ట్రపతి పదవికి జూలై 5న నామినేషన్ ప్రక్రియ మొదలు కాగా, ఆగస్టు 6న ఓటింగ్ జరగనుంది. ఈ క్రమంలో ఎన్డీఏ తరపున ఉప రాష్ట్రపతి బరిలో నిలిచే అభ్యర్థిగా నఖ్వీ తో పాటుగా కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, పంజాబ్ మాజీ సీఎం అమరిందర్ సింగ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY