ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ ముఖ్యమంత్రిగా నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ నేత నీఫియు రియో ప్రమాణస్వీకారం చేశారు. మంగళవారం మధ్యాహ్నం కోహిమాలోని రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో నాగాలాండ్ గవర్నర్ లా గణేశన్ నీఫియు రియో చేత నాగాలాండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా నాగాలాండ్ సీఎంగా నీఫియు రియో బాధ్యతలు స్వీకరించడం ఇది ఐదో సారి. నీఫియు రియోతో పాటుగా 12 మంది సభ్యుల మంత్రిమండలితో గవర్నర్ లా గణేశన్ ప్రమాణం చేయించారు. వీరిలో తాడితుయ్ రంగ్కౌ జెలియాంగ్ మరియు యంతుంగో పాటన్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, పలువురు బీజేపీ నేతలు, పలు పార్టీల నేతలు హాజరై, సీఎంగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నీఫియు రియోకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇటీవల జరిగిన నాగాలాండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మరియు నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ) కూటమి 37 స్థానాల్లో విజయం సాధించి, మ్యాజిక్ ఫిగర్ సాధించింది. మొత్తం 60 స్థానాలకు గానూ ఎన్డీపీపీ 27 స్థానాల్లో, బీజేపీ 12 స్థానాల్లో, ఎన్సీపీ పార్టీ 7 స్థానాలు, ఎన్పీపీ 5, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా 2, ఎల్జేపీ (రామ్ విలాస్) 2, ఎన్పీఎఫ్ 2, జేడీయూ 1, ఇండిపెండెంట్ అభ్యర్థులు 4 స్థానాల్లో విజయం సాధించారు. నాగాలాండ్ లో సీఎం పీఠం దక్కించుకునేందుకు ఏ పార్టీ/కూటమికీ అయినా 31 అసెంబ్లీ స్థానాలు దక్కించుకోవాల్సి ఉండగా, బీజేపీ-ఎన్డీపీపీ నేతృత్వంలోని కూటమి 37 స్థానాల్లో విజయంతో, నాగాలాండ్ లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే నేడు నాగాలాండ్ సీఎంగా నీఫియు రియో ఐదోసారి బాధ్యతలు చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో నాగాలాండ్ సీఎం నీఫియు రియో ఉత్తర అంగామి-2 స్థానం తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన సెయివిల్లే సచుపై 15,824 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE