పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సంస్థ కార్యకలాపాలపై దేశవ్యాప్తంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) మరియు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లు సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు సహా పది రాష్ట్రాల్లో గురువారం తెల్లవారుజాము నుంచి సోదాలు చేపట్టాయి. ఈ క్రమంలో 100 మందికి పైగా అనుమానిత పీఎఫ్ఐ సభ్యులను అరెస్ట్ చేశారు. అలాగే వారితో సంబంధం ఉన్న వ్యక్తులను రాష్ట్ర పోలీసులు వేర్వేరు కేసులలో అరెస్టు చేశారు. ఎన్ఐఏ, ఈడీ అధికారులు పక్కా సమాచారంతో ఏకకాలంలో 40కిపైగా ప్రాంతాల్లో ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పీఎఫ్ఐ జాతీయ, రాష్ట్ర, స్థానిక నేతలకు చెందిన ఇళ్ళు, పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
టెర్రర్ ఫండింగ్, ఉగ్రవాద శిక్షణా శిబిరాలను నిర్వహించడం మరియు నిషేధిత సంస్థలలో చేరడానికి ప్రజలను ప్రోత్సహించడం వంటి ఆరోపణలపై పీఎఫ్ఐ సంస్థపై గత కొన్ని రోజులుగా దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టాయి. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడంపై సరైన ఆధారాలు లభించినందునే వెంటనే రంగంలోకి దిగినట్లు ఏజెన్సీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ దాడులలో 200 మందికిపైగా ఎన్ఐఏ అధికారులు పాల్గొంటున్నారు. ఇక ఉభయ తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ సంస్థకు సంబంధించిన పలువురి ఇళ్లపై తాజాగా దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడులలో హార్డ్ డిస్క్, పెన్డ్రైవ్, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న అధికారులు, వాటి ఆధారంగా మరికొందరిని అరెస్ట్ చేశారు. కాగా ఎన్ఐఏ ఇప్పటివరకు చేపట్టిన ఆపరేషన్లలో ఇదే అతిపెద్ద ఆపరేషన్గా చెప్తున్నారు. ఇక ఈ మొత్తం ఆపరేషన్ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్వయంగా పర్యవేక్షిస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY