హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా సెప్టెంబర్ 25, ఆదివారం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ టికెట్లను సికింద్రాబాద్లోని జింఖానా మైదానంలో గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విక్రయించనున్నట్టు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) ప్రకటించింది. ఒక్కొక్కరికి రెండు టికెట్లు మాత్రమే విక్రయిస్తామని, టికెట్లు కొనేందుకు వచ్చేవాళ్లు ఆధార్ కార్డు వెంట తెచ్చుకోవాలని హెచ్సీఏ సూచించింది. దీంతో గురువారం ఉదయం నుంచే క్రికెట్ అభిమానులు వేల సంఖ్యలో జింఖానా మైదానం వద్ద బారులు తీరారు. అయితే అభిమానులను పోలీసులను నియంత్రించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో సుమారు 20 మంది అభిమానులు స్పృహ తప్పిపడిపోయినట్టుగా తెలుస్తుంది.
కాగా ముందునుంచి ఈ మ్యాచ్ టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు భారీగా ఆసక్తి చూపుతున్నారు. అయితే మ్యాచ్ తేదీ దగ్గరపడుతున్నప్పటికీ హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) నుంచి టికెట్ల విక్రయం విషయంలో కొంత గందరగోళం నడిచింది. దీంతో బుధవారం క్రికెట్ అభిమానులు జింఖానా మైదానానికి భారీగా చేరుకొని టికెట్ల విక్రయంపై నిరసన వ్యక్తం చేశారు. అభిమానుల ఆందోళనతో పోలీసులు హెచ్సీఏ అధికారులతో చర్చలు జరపగా, గురువారం జింఖానా మైదానంలో మ్యాచ్ టికెట్స్ విక్రయిస్తామని హెచ్సీఏ హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే గురువారం 10 గంటల నుంచి జింఖానాలో మ్యాచ్ టికెట్ల విక్రయం జరగనుంది. మరోవైపు ఈ అంశంపై తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ స్పందిస్తూ, భారత్, ఆస్ట్రేలియా మధ్య ఉప్పల్ స్టేడియంలో జరిగే మూడో టీ20 మ్యాచ్ టికెట్లను బ్లాక్లో విక్రయించినట్లు తేలితే తీవ్ర పరిణామాలుంటాయని అన్నారు. నిబంధనలకు అనుగుణంగా అభిమానులకు టికెట్స్ ను అందుబాటులో ఉంచాలని, మ్యాచ్ టికెట్ల విక్రయంలో అవకతవకలు జరిగితే విచారణ జరిపిస్తామని అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY