తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కే.టి.రామారావు స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యుఇఎఫ్) వార్షిక సదస్సులో పాల్గొననున్నారు. జనవరి 21 నుంచి 24 వరకు ఈ సదస్సులో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. ఈ సదస్సుకు హాజరయ్యే ప్రపంచదేశాల పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులుకు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను మంత్రి కేటీఆర్ వివరించనున్నారు. ఈ సదస్సు సందర్భంగా ఐటీతో పాటుగా ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్, లైఫ్ సైన్సెస్ వంటి రంగాలపై దృష్టి సారించనున్నట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు జనవరి 20 నుంచి మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో పాటుగా పలు ప్రపంచదేశాల నాయకులు, ప్రతినిధులు హాజరుకానున్నారు.
ఈ పర్యటనపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ, దావోస్కు సదస్సుకు వచ్చే ప్రతినిధులు ఒక నిర్దిష్ట ఉద్దేశ్యంతో వస్తారని, సమయం వృథా చేయకుండా నిర్ణయాల వైపుగా ముందుకు కదులుతారని అన్నారు. ఈసారి సమావేశాలకు షెడ్యూల్ రూపొందించుకున్నామని, ముఖ్యంగా ఐటీ రంగంలో ఫాలో-అప్లు చేయాల్సిన కొన్ని అంశాలున్నాయని చెప్పారు. ఈ సదస్సు సందర్భంగా జరిగే చర్చల్లో కొన్ని నేరుగా పెట్టుబడులకు దారి తీస్తాయని, మరికొన్ని ముందుకెళ్ళేందుకు దారి చూపిస్తాయని పేర్కొన్నారు.
[subscribe]