పాకిస్థాన్లో మే 22, శుక్రవారం నాడు ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ (పీఐఏ) కు చెందిన విమానం కరాచీలో కుప్పకూలిపోయింది. లాహోర్ నుండి కరాచీకి వెళ్లే ఈ విమానం ల్యాండ్ కావడానికి కొద్దీ నిమిషాల ముందు కరాచీ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న జనావాస ప్రాంతంలో కూలిపోయింది. విమానం – ఏ 320 లో 9 మంది సిబ్బందితో కలిపి మొత్తం 107 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఈ విమాన ప్రమాదాన్ని పీఐఏ ప్రతినిధి అబ్దుల్ సత్తార్ ధృవీకరించారు. అయితే ప్రమాద వివరాలపై స్పందించడానికి నిరాకరించారు. నివాస ప్రాంతంలో ఈ విమానం కుప్పకూలిపోవడంతో మృతుల సంఖ్య ఎక్కువుగా ఉండే అవకాశం ఉంది.
విమాన ప్రమాదంపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఈ ప్రమాద ఘటనపై దర్యాప్తు జరిపించాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు. మరోవైపు ఈ ప్రమాదంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. “పాకిస్తాన్లో జరిగిన విమాన ప్రమాదంలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర బాధాకరం. మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని” ప్రధాని మోదీ అన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu