ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బీహార్ రాష్ట్రంలో చారిత్రక ‘కోసి మహా రైలువారధి’ని జాతికి అంకితం చేయడంతోపాటు కొత్త రైలుమార్గాలు, విద్యుదీకరణ పథకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ కోసి మహావారధి, కియూల్ వంతెన, విద్యుదీకరణ పథకాల ప్రారంభంతో పాటు రైల్వేల్లో ‘మేక్ ఇన్ ఇండియా’కు ప్రోత్సాహం, కొత్త ఉపాధి కల్పనకు వీలున్న మరో 12 పథకాలను రూ.3,000 కోట్లతో ప్రారంభించినట్లు పేర్కొన్నారు. బీహార్ లో నేటికీ దాదాపు 90 శాతం రైలుమార్గాల నెట్వర్క్ విద్యుదీకరణ పూర్తయిందని ప్రధాని అన్నారు. ముఖ్యంగా గడచిన ఆరేళ్లలోనే బీహార్లో 3000 కిలోమీటర్లకు పైగా రైల్వే విద్యుదీకరణ పూర్తయినట్లు పేర్కొన్నారు.
2014 కు ముందు ఐదేళ్లలో కేవలం 325 కిలోమీటర్ల కొత్త రైలుమార్గాలు ప్రారంభం కాగా, 2014 తర్వాతి 5 సంవత్సరాలలోనే బీహార్లో 700 కిలోమీటర్ల కొత్త రైలుమార్గాలు ప్రారంభించబడ్డాయని వివరించారు. కరోనా సంక్షోభ సమయంలో రైల్వేలు నిర్విరామంగా పనిచేశాయని ప్రధాని మోదీ ప్రశంసించారు. ముఖ్యంగా వలస కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు వారిని శ్రామిక్ స్పెషల్ రైళ్లద్వారా స్వస్థలాలకు చేర్చడంలో రైల్వేశాఖ కీలక పాత్ర పోషించిందని కొనియాడారు. అదేవిధంగా కరోనా మహమ్మారి పరిస్థితుల నడుమ దేశంలో మొట్టమొదటి కిసాన్ రైలును బీహార్-మహారాష్ట్ర మధ్య ప్రవేశపెట్టడాన్ని ఈ సందర్భంగా ప్రధాని మోదీ గుర్తుచేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu