ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 10, మంగళవారం నాడు ఉజ్వల 2.0 (ప్రధానమంత్రి ఉజ్వల యోజన-పీఎంయూవై ) పథకాన్ని ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మహోబాకు చెందిన మహిళలకు ఎల్పీజీ కనెక్షన్లను అందించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఉజ్వల 2.0 లబ్ధిదారులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు.
ముందుగా 2016లో ఉజ్వల 1.0 పథకం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ పథకం కింద 5 కోట్ల మంది బీపీఎల్ కుటుంబాలకు చెందిన మహిళలకు ఉచితంగా ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వడం లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఆ తర్వాత 2018 ఏప్రిల్ నుంచి పథకాన్ని మరో ఏడు వర్గాలకు చెందిన (ఎస్సీ/ఎస్టీ, పిఎంఏవై, ఏఏవై, అత్యంత వెనుకబడిన వర్గాలు, తేయాకు తోటల కార్మికులు, అటవీ, ద్వీప ప్రాంత నివాసులు) మహిళలకు కూడా విస్తరించారు. ఎల్పీజీ కనెక్షన్లు అందజేసే లక్ష్యాన్ని కూడా 8 కోట్లకు పెంచారు. అందులో భాగంగా 2019 ఆగస్టు నాటికి అనగా నిర్దేశిత సమయం కన్నా 7 నెలల ముందే లక్ష్యాన్ని చేరుకున్నారు.
అనంతరం 2021-22 కేంద్ర బడ్జెట్ లో పీఎంయూవై పథకం కింద మరో కోటి ఎల్పీజీ కనెక్షన్ల జారీకి అవసరమైన నిధులు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. ఈ అదనపు కోటి కనెక్షన్లను ఉజ్వల 2.0 పథకం కింద అందించనున్నారు. ఉజ్వల 1.0లో కవర్ చేయలేని తక్కువ ఆదాయ కుటుంబాలకు డిపాజిట్ రహిత ఎల్పీజీ కనెక్షన్స్ అందిస్తారు. ఈ ఉజ్వల 2.0 పథకం కింద డిపాజిట్ రహిత ఎల్పీజీ కనెక్షన్ల జారీతో పాటుగా తొలి రీఫిల్, హాట్ ప్లేట్ ఉచితంగా అందిస్తారు. ఉజ్వల 2.0 లో వలస కార్మికులు రేషన్ కార్డు గాని లేదా అడ్రస్ ప్రూఫ్ గాని సమర్పించాల్సిన అవసరం ఉండదు. కుటుంబ డిక్లరేషన్ మరియు అడ్రస్ ప్రూఫ్ రెండూ లిఖిత పూర్వకంగా స్వయంగా అందజేస్తే సరిపోతుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ