ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం సాయంత్రం కర్ణాటకలోని బెలగావిలో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి (పీఎం-కిసాన్) పథకం యొక్క 13వ విడత నిధులను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా అర్హులైన 8 కోట్లకుపైగా రైతు లబ్ధిదారులకు ప్రత్యక్ష ప్రయోజనాల బదిలీ(డీబీటీ) ద్వారా పీఎం-కిసాన్ 13వ విడత కింద రూ.16,000 కోట్ల నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో అర్హులైన రైతుల ఖాతాల్లో నేరుగా రూ.2000 చొప్పున జమ కానున్నాయి.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా చిన్న రైతుల ఖాతాల్లో ఇప్పటి వరకు 2.5 లక్షల కోట్ల రూపాయలు జమ చేశామని, అందులో 50 వేల కోట్లకు పైగా మహిళా రైతుల ఖాతాల్లో జమ అయ్యాయని తెలిపారు. మధ్యవర్తి ప్రమేయం లేకుండా ఇంత పెద్ద మొత్తంలో బదిలీ చేయడం ప్రపంచ వ్యాప్తంగా ప్రజల దృష్టిని కూడా ఆకర్షించిందన్నారు. భారతదేశంలోని రైతులందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని, హోలీకి ముందు వారికి ప్రత్యేక బహుమతి లభించిందని అన్నారు.
నేటి మారుతున్న భారతదేశం అణగారిన వారికి ప్రాధాన్యత ఇస్తూనే ఒకదాని తర్వాత ఒకటి అభివృద్ధి కార్యక్రమాలను సాధిస్తోందని, ప్రస్తుత ప్రభుత్వం చిన్న రైతులకు ప్రాధాన్యతనిస్తోందని ప్రధాని పేర్కొన్నారు. 2014కి ముందు 25,000 కోట్లుగా ఉన్న దేశ వ్యవసాయ బడ్జెట్ ఇప్పుడు 1,25,000 కోట్లకు పెరిగిందని, ఇది ఐదు రెట్లు పెరిగిందని ప్రధాని పునరుద్ఘాటించారు. దేశంలోని రైతులను ఆదుకోవాలనే బీజేపీ ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. రైతులకు నేరుగా ప్రయోజనం చేకూర్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడాన్ని ప్రధాని ప్రస్తావిస్తూ, జన్ ధన్ బ్యాంక్ ఖాతాలు, మొబైల్ కనెక్షన్లు మరియు ఆధార్ను ఉదాహరణగా చెప్పారు. రైతులు ఏ దశలోనైనా బ్యాంకుల మద్దతును పొందాలనే లక్ష్యంతో ప్రభుత్వం రైతులను కిసాన్ క్రెడిట్ కార్డులకు అనుసంధానం చేస్తోందని అన్నారు. ప్రస్తుత అంశాలతో పాటు వ్యవసాయానికి సంబంధించిన భవిష్యత్తు అవసరాలను ఈ ఏడాది బడ్జెట్లో ప్రస్తావించినట్లు ప్రధాని తెలిపారు.
ఈ బడ్జెట్లో స్టోరేజీ సౌకర్యాలకు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు సహకార సంఘాలపై దృష్టి సారించామని, అదేవిధంగా సహజ వ్యవసాయంపై దృష్టి సారిస్తే రైతుకు ఖర్చులు తగ్గుతాయన్నారు. పీఎం ప్రాణం పథకం వంటి చర్యలు ఎరువులపై ఖర్చులను మరింత తగ్గిస్తాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కర్నాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై, కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే మరియు పలువురు కర్నాటక ప్రభుత్వ మంత్రులు, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE