కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 3 వ తేదీ వరకు లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ముందుగా దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు విధించిన లాక్డౌన్ గడువు ఈ రోజుతో (ఏప్రిల్ 14, మంగళవారం) ముగియనుండటంతో ప్రధాని మోదీ మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా లాక్డౌన్ ను మే 3 వరకు పొడిగిస్తునట్టు కీలక ప్రకటన చేశారు.
ప్రధాని మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
- కరోనావైరస్ పై పోరాడడంలో దేశ ప్రజల కృషిని ప్రభుత్వం గుర్తించింది.
- కరోనావైరస్పై భారత్ పోరాటం చాలా బలంగా జరుగుతుంది.
- ప్రజల సహనం కారణంగా దేశంలో కరోనావైరస్ యొక్క వ్యాప్తి కట్టడి చేయగలిగాం. దేశాన్ని కాపాడటానికి ప్రజలంతా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
- ఈ కాలంలో ప్రజలందరికి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయో నాకు తెలుసు. ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రజలు దేశాన్ని రక్షించారు. భారత ప్రజల త్యాగానికి గౌరవంగా నమస్కరిస్తున్నాను.
- దేశంలో మొదటి కేసు కనుగొనబడక ముందే విమానాశ్రయాలలో స్క్రీనింగ్ ప్రారంభించాం.
- ఈ కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రారంభం నుండి భారతదేశం అప్రమత్తంగా ఉంది.
- భారతదేశంలో 550 కరోనావైరస్ కేసులు ఉన్నప్పుడు, వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి 21 రోజుల పాటు లాక్డౌన్ విధించాం.
- సమస్య పెద్దది అయ్యేదాకా భారత్ వేచి చూడలేదు, 21 రోజుల పాటు కరోనావైరస్ లాక్డౌన్ ప్రకటించటానికి ప్రభుత్వం పెద్ద అడుగు వేసింది.
- దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నాం.
- ఈ నిర్ణయం వలన భారతదేశ ఆర్ధిక వ్యవస్థపై చాలా ప్రభావం ఉండొచ్చు. కానీ మానవ ప్రాణాలను కాపాడటానికి ప్రత్యామ్నాయం లేదు.
- రాష్ట్రాలు మరియు ప్రజలతో సహా పలువురు మేధావుల సూచనలు లాక్డౌన్ పొడిగింపుకే అనుకూలంగా ఉన్నాయి.
- ఏప్రిల్ 20 వరకు లాక్డౌన్ కఠినమైన రీతిలో అమల్లో ఉంటుంది. ఏప్రిల్ 20 తర్వాత దేశంలో వైరస్ వ్యాప్తి చెందని సురక్షిత ప్రాంతాల్లో కొంతమేర లాక్డౌన్ సడలింపు ఉండవచ్చు.
- ఏప్రిల్ 20 తర్వాత హాట్స్పాట్ లు తక్కువున్న రాష్ట్రాలు కొన్ని ముఖ్యమైన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి కొన్ని షరతులతో అనుమతించబడతాయి.
- కరోనావైరస్ పై చేసే పోరాటం వచ్చే వారం మరింత కఠినతరం, కీలకం కానుంది.
- కోవిడ్ -19తో పోరాడటానికి భారతదేశంలో 600 కి పైగా ఆసుపత్రులు ఉన్నాయి.
- ఇప్పటికే దేశవ్యాప్తంగా 1 లక్ష పడకల ఏర్పాట్లు చేశాం.
- 220కి పైగా ల్యాబ్ లలో కరోనా వైద్యపరీక్షలు జరుగుతున్నాయి.
- రేపు లాక్డౌన్ పొడిగింపుపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేస్తుంది.
- దేశంలో పరిమిత వనరులు ఉండవచ్చు, కాని కరోనాకు వ్యాక్సిన్ను కనుగొనేందుకు ముందుకు రావాలని దేశ శాస్త్రవేత్తలు మరియు వైద్యులను విజ్ఞప్తి చేస్తున్నాను.
- రైతులకు సమస్యలను ఎదుర్కోకుండా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయి.
- కొత్త మార్గదర్శకాల జారీలో పేద మరియు రోజువారీ కూలీ కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకున్నాం.
- దేశంలో మందులు మరియు రేషన్ నిల్వ తగినంతగా ఉంది.
- వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవడం, సామాజిక దూరాన్ని కొనసాగించడం మరియు పేదలకు సహాయం చేయడం వంటి ఏడు విషయాలలో కేంద్రప్రభుత్వం ప్రజల మద్దతును కోరుతుంది.
- ఆరోగ్య సేతు యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని, లాక్డౌన్ నిబంధనలను హృదయపూర్వకంగా పాటించాలని భారత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.
- ఈ సమయంలో దేశప్రజలకు 7 విజ్ఞప్తులు.
- –>దయచేసి వృద్ధులను జాగ్రత్తగా చూసుకోండి. సామాజిక దూరాన్ని పాటించండి.
–>ఇంట్లో తయారు చేసుకున్న మాస్కులను ప్రతిఒక్కరూ ధరించాలి.
–>రోగనిరోధక శక్తిని పెంచుకునేలా ప్రయత్నించండి.
–>’ఆరోగ్య సేతు’ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి
–>పేదలకు మరియు ఆకలితో ఉన్నవారికి సహాయం చేయండి.
–>కరుణతో ఉండండి, సిబ్బందిని తీసివేయవద్దు.
–>కరోనా పై యుద్ధం చేసే యోధులను గౌరవించండి. - మనం సహనం చూపించి నియమాలు, క్రమశిక్షణను పాటిస్తే, కరోనాకు వ్యతిరేకంగా చేసే ఈ యుద్ధంలో విజయం సాధిస్తాం.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]