జనవరి 15 (ఆదివారం) ఉదయం 10:30 గంటలకు సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే ‘వందే భారత్’ ఎక్స్ప్రెస్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. ఈ మేరకు పీఎంఓ కార్యాలయం అధికారిక ప్రకటనలో తెలిపింది. కాగా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వందే భారత్ రైళ్లు ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కూడా వందే భారత్ రైలు ప్రారంభం చేయడానికి కేంద్రం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ చేతుల మీదుగా రేపు ఇది ప్రారంభమవనుంది. దీంతో రైల్వే అధికారులు దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు.
ఇక రేపు ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో భౌతికంగా హాజరుకానున్నారు. ఇక భారతీయ రైల్వేలు ఇప్పటివరకు 7 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టగా.. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచేది ఎనిమిదోది కావడం విశేషం. రైలు యొక్క సాధారణ సేవలు జనవరి 16 నుండి ప్రారంభమవుతాయని, అలాగే బుకింగ్లు శనివారం ప్రారంభమైనట్లు రైల్వే వర్గాలు తెలిపాయి.
సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే ‘వందే భారత్’ ఎక్స్ప్రెస్ రైలు ప్రత్యేకతలు..
- హైదరాబాద్-విశాఖపట్నం నగరాల మధ్య ప్రస్తుతం సాధారణ రైలు ప్రయాణ సమయం దాదాపు 12 గంటలు.
- అయితే వందేభారత్ ఎక్స్ప్రెస్ ఈ సమయాన్ని 3.20 గంటలు తగ్గిస్తుంది. అంటే 8.40 గంటల్లో గమ్యం చేరుస్తుంది.
- ఇక రైలు వేగం గంటకు రూ.160 కి.మీ. కాగా ఈ మార్గంలో దీనిని 80 నుంచి 90 కి.మీ. వేగంతో నడుపుతారు.
- అలాగే ప్రయాణం మధ్యలో ఇది కేవలం నాలుగు స్టేషన్లలో మాత్రమే ఇది ఆగుతుంది.
- విశాఖలో బయలుదేరితే రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్ స్టేషన్లలోనే ఆగుతుంది.
- విశాఖ నుంచే బయలుదేరే రైలుకు 20833 నంబరు కేటాయించగా.. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే రైలుకు 20834 నంబరు ఇచ్చారు.
- కాగా ఈ రైలు వారానికి ఆరు రోజులు మాత్రమే నడుస్తుంది. ఆదివారం దీనికి పూర్తిగా సెలవు ఉంటుంది.
‘వందే భారత్’ ఎక్స్ప్రెస్ ప్రయాణ సమయాలు..
- వందే భారత్ రైలు ప్రతిరోజు ఉదయం 5.45 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరుతుంది.
- 7.55 గంటలకు రాజమండ్రి, 10.00 గంటలకు విజయవాడ, 11.00 గంటలకు ఖమ్మం, 12.05 గంటలకు వరంగల్ మీదుగా మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది.
- అలాగే సికింద్రాబాద్ నుంచి బయలుదేరే రైలు మధ్యాహ్నం 3.00 గంటలకు ప్రారంభమవుతుంది.
- సాయంత్రం 4.35 గంటలకు వరంగల్, 5.45 గంటలకు ఖమ్మం, రాత్రి 7.00 గంటలకు విజయవాడ, 8.58 గంటలకు రాజమండ్రి, 11.30 గంటలకు విశాఖపట్నం చేరుతుంది.
- ఇక ఇందులో మొత్తం 16 కోచ్లు ఉండగా.. ఎగ్జిక్యూటివ్ క్లాస్ చైర్, చైర్ కారు అని రెండు తరగతులుగా విభజించారు.
- అయితే ఈ రైలులో కూర్చొనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది, పడుకోవడానికి వీలుండదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE