ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు జర్మనీ, డెన్మార్క్ మరియు ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇది 2022లో ప్రధాని మోదీ చేయబోయే మొదటి విదేశీ పర్యటన అని పేర్కొన్నారు. ఈ పర్యటనలో భాగంగా బెర్లిన్లో ఫెడరల్ ఛాన్సలర్ ఆఫ్ జర్మనీ ఓలాఫ్ స్కోల్జ్ తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. ఇద్దరు నేతలు ఇండియా-జర్మనీ ఇంటర్-గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ (ఐజిసి) ఆరవ ఎడిషన్కు సంయుక్తంగా అధ్యక్షత వహించనున్నారని తెలిపారు. ఇది ఛాన్సలర్ స్కోల్జ్తో ప్రధాని మోదీ యొక్క మొదటి ఐజిసి సమావేశమని, అలాగే డిసెంబర్ 2021లో అధికారం చేపట్టిన కొత్త జర్మన్ ప్రభుత్వంతో మొదటి ప్రభుత్వ సంప్రదింపులని పేర్కొన్నారు.
అనంతరం డెన్మార్క్ ప్రధానమంత్రి మెట్టే ఫ్రెడరిక్సెన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ అధికారిక పర్యటనపై కోపెన్హాగన్కు వెళతారని, డెన్మార్క్ వేదికగా జరుగుతున్న 2వ ఇండియా-నార్డిక్ సమ్మిట్లో కూడా పాల్గొంటారని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఈ పర్యటన సందర్భంగా ప్రధాని ఇండియా-డెన్మార్క్ బిజినెస్ ఫోరమ్లో పాల్గొని, ప్రవాస భారతీయ సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. ఇక మే 4న తిరుగు ప్రయాణంలో ప్రధాని మోదీ కొద్దిసేపు పారిస్లో ఆగి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తో సమావేశం అవుతారని చెప్పారు. భారత్ మరియు ఫ్రాన్స్ ఈ సంవత్సరం వారి మధ్య దౌత్య సంబంధాల 75 సంవత్సరాన్ని జరుపుకుంటున్నాయని, ఇద్దరు నాయకుల మధ్య జరిగే ఈ సమావేశం ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యంకు సంబంధించి మరింత ప్రతిష్టాత్మక ఎజెండాను ఏర్పాటు చేయనుందని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ