సెప్టెంబర్ 22, ఆదివారం నాడు అమీర్పేట్ మెట్రో స్టేషన్ ఆవరణలో ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మెట్రో స్టేషన్లో సీలింగ్ పెచ్చులూడి తలపై పడడంతో కంతాల మౌనిక అనే యువతి ప్రాణాలు కోల్పోయారు. బయట వర్షం కురుస్తుండడంతో ఆమె మెట్రో స్టేషన్ కింద నిరీక్షిస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె వయసు 24 సంవత్సరాలు, ఇటీవలే వివాహం అయినట్టు కూకట్ పల్లి హౌజింగ్ బోర్డులో నివాసముంటున్నట్టుగా గుర్తించారు. నిత్యం రద్దీగా ఉండే ఈ స్టేషన్లో ప్రమాదం చోటు చేసుకోవడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జరిగిన ప్రమాద ఘటనపై హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పందించారు. మెట్రో స్టేషన్ సీలింగ్ భాగం నుంచి సిమెంట్ పెచ్చులూడి, 9 మీటర్ల ఎత్తునుంచి మహిళ తలపైనా పడడంతో ప్రమాదవశాస్తూ మృతి చెందారని చెప్పారు. మౌనిక కుటుంబానికి పరిహారం ఇవ్వాలని ఎల్ అండ్ టీ సంస్థకు సూచిస్తామన్నారు. నగరంలో ఈ ఘటన సంచలనం సృష్టించడంతో మూడు మార్గాల్లో ఉన్న 64 స్టేషన్లలో ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా నిపుణల బృందం ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టి, తగిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు తెలిపారు.
[subscribe]