దేశంలోని కోవిడ్-19 పరిస్థితులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 11, శనివారం నాడు సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్, నీతీ ఆయోగ్ సభ్యుడు, కేబినెట్ కార్యదర్శి తో పాటు ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో పరిస్థితులను, వివిధ రాష్ట్రాల పనితీరును పీఎం మోదీ అడిగి తెలుసుకున్నారు. వ్యక్తిగత పరిశుభ్రత మరియు బహిరంగ ప్రదేశాల్లో సామాజిక క్రమశిక్షణను అందరూ పాటించాల్సిన అవసరాన్ని గుర్తించి, తప్పక అమలు చేయాలనీ పీఎం ఆదేశించారు. కోవిడ్-19 గురించి ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించాలనీ, వైరస్ వ్యాప్తిని నివారించడానికి నిరంతర ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ విషయంలో ఎవరూ సంతృప్తి చెందకూడదని, మెరుగ్గా పనిచేయాలని పీఎం స్పష్టం చేశారు.
ముఖ్యంగా ఢిల్లీలో కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయడంలో కేంద్ర, రాష్ట్ర, స్థానిక అధికారుల కృషిని పీఎం మోదీ ప్రశంసించారు. కరోనాను నియంత్రించడంలో ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి విధానాన్ని అనుసరించాలని పీఎం ఆదేశించారు. అలాగే అహ్మదాబాద్లో ‘ధన్వంత్రి రథ్’ ద్వారా నిర్వహిస్తున్న కరోనా నిఘా చర్యలు మరియు గృహ ఆధారిత సంరక్షణను విజయవంతమైన ఉదాహరణగా పీఎం మోదీ పేర్కొన్నారు. ఇతర ప్రాంతాలల్లో కూడా ఈ విధానాన్ని అవలంబించవచ్చునని ఆయన సూచించారు. కరోనా పాజిటివ్ రేటు ఎక్కువుగా ఉన్న ప్రాంతాలు మరియు అన్ని ప్రభావిత రాష్ట్రాలకు రియల్ టైమ్ జాతీయ స్థాయి పర్యవేక్షణ మరియు మార్గదర్శకత్వం అందించాలని కూడా పీఎం మోదీ అధికారులను ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu