దేశంలో ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 10, సోమవారం నాడు వరదలపై ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అస్సాం, బీహార్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులతో మాట్లాడి నైరుతి రుతుపవనాలు మరియు ప్రస్తుత వరద పరిస్థితులను ఎదుర్కోవటానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వరదలను అంచనా వేసేందుకు కేంద్రం, రాష్ట్రాల మధ్య మంచి సమన్వయం కోసం శాశ్వత వ్యవస్థ అవసరమని పీఎం మోదీ అన్నారు. సూచనలు చేయడం, హెచ్చరిక జారీచేసే వ్యవస్థను మెరుగుపరచడానికి వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని పేర్కొన్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా భారత వాతావరణ శాఖ, సెంట్రల్ వాటర్ కమిషన్ వంటి సంస్థలు వరదల విషయంలో మెరుగైన మరియు మరింత ఉపయోగపడే సూచనలు చేస్తున్నాయని పీఎం మోదీ చెప్పారు. అస్సాం, బీహార్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక ముఖ్యమంత్రులు వారి యొక్క రాష్ట్రాలలో వరదల పరిస్థితి, చేపడుతున్న సహాయక చర్యలు గురించి వివరణ ఇచ్చారు. సకాలంలో చేరుకొని, ప్రజలను రక్షించడంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో సహా కేంద్ర ఏజెన్సీల కృషిని ముఖ్యమంత్రులు అభినందించారు. వరద ప్రభావాలను తగ్గించడానికి స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక చర్యలకు వారు కొన్ని సూచనలు ఇచ్చారు. రాష్ట్రాలు ఇచ్చిన సూచనలపై చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ సంబంధిత మంత్రిత్వ శాఖలు మరియు సంస్థల అధికారులను ఆదేశించారు. వివిధ విపత్తులను ఎదుర్కోవటానికి, సామర్థ్యాలను బలోపేతం చేయడానికి రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తూనే ఉంటుందని పీఎం మోదీ హామీ ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu