రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు (జూలై 22, శుక్రవారం) సాయంత్రం 5:30 గంటలకు ఢిల్లీలోని హోటల్ అశోక్ లో వీడ్కోలు విందు ఏర్పాటు చేశారు. భారతదేశ అత్యున్నత రాజ్యాంగ పదవిలో పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జూలై 24న పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతికి ప్రధాని మోదీ వీడ్కోలు విందు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి కాబోయే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, బీజేపీ ముఖ్య నేతలు, అలాగే మిత్ర పక్షం, విపక్షాలకు చెందిన నేతలు, పలువురు అధికారులు హాజరు కానున్నట్టు తెలుస్తుంది.
భారతదేశ 14వ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ జూలై 25, 2017న ప్రమాణ స్వీకారం చేశారు. కేఆర్ నారాయణన్ తర్వాత రాష్ట్రపతి పదవిని చేపట్టిన రెండో దళితుడుగా రామ్నాథ్ కోవింద్ నిలిచారు. ముందుగా 16 ఏళ్ల పాటు 1993 వరకు ఢిల్లీ హైకోర్టు మరియు సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ఆయన ప్రాక్టీస్ చేశారు. అనంతరం రామ్నాథ్ కోవింద్ బీజేపీలో చేరి 1994లో ఉత్తరప్రదేశ్ నుండి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. వరుసగా రెండు పర్యాయాలు అనగా మార్చి 2006 వరకు 12 సంవత్సరాల పాటుగా రాజ్యసభ ఎంపీగా సేవలు అందించారు. అలాగే 2015–2017 మధ్య బీహార్ గవర్నర్ గా కూడా రామ్నాథ్ కోవింద్ విధులు నిర్వర్తించారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24న ముగియనుండగా, జూలై 25వ తేదీన పార్లమెంట్ సెంట్రల్ హాల్లో నూతన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY