జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి కన్నుమూశారు. గురువారం మధ్యాహ్నం పల్నాడు జిల్లా మాచర్లలో ఆమె తుది శ్వాస విడిచారు. సీతామహాలక్ష్మి ప్రస్తుతం మాచర్ల పట్టణం, ప్రియదర్శిని కాలనీలోని ఆమె కుమారుడు జీవీ నరసింహారావు వద్ద ఉంటున్నారు. 100 సంవత్సరాల వయసు కలిగిన సీతామహాలక్ష్మి చాలా రోజులుగా వృధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. కాగా సీతామహాలక్ష్మి భర్త పేరు ఘంటసాల ఉగ్రనరసింహుడు, వీరికి మొత్తం ఆరుగురు సంతానం. వారిలో నరసింహారావు ఉపాధ్యాయునిగా పనిచేసి పదవీ విరమణ పొంది ప్రస్తుతం మాచర్లలో ఉంటున్నారు. ఈయన వద్దే సీతామహాలక్ష్మి తన చివరి రోజులను గడుపుతున్నారు.
ఇక జాతీయ జెండాను రూపొందించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గతేడాది మార్చి 12న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాచర్లకు వెళ్లి సీతామహాలక్ష్మిని సత్కరించి ప్రభుత్వం తరఫున రూ.75 లక్షల చెక్కును అందజేశారు. కాగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా వచ్చే నెల 2వ తేదీన సీతామహాలక్ష్మిని ఢిల్లీ తీసుకువెళ్ళి కేంద్రం తరపున సత్కరించనున్నారు. అయితే ఇంతలోనే ఆమె కన్నుమూశారు. ఈ నేపథ్యంలో సీతామహాలక్ష్మీ మృతి వార్త తెలుసుకున్న సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికార లాంఛనాలతో సీతామహాలక్ష్మి పార్ధివదేహానికి అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు మాచర్లలో ఆమెకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
కాగా నరసింహారావు తన తాత పింగళి వెంకయ్య చరిత్రపై ఒక పుస్తకాన్ని రచించారు. అందులో తల్లి ద్వారా తెలుసుకున్న స్వాతంత్య్ర కాలం నాటి అనుభవాలను పొందుపరిచారు. కృష్ణా జిల్లాకు చెందిన పింగళి వెంకయ్య, 1921 ఏప్రిల్ 1న మహాత్మాగాంధీ విజయవాడ నగరానికి వచ్చిన సందర్భంగా ఆయనకు తన స్వహస్తాలతో రూపొందించిన పతాకాన్ని బహుకరించారు. బ్రిటీషు పాలన కింద ఉన్న మనకు అప్పటివరకు జాతి మొత్తాన్ని ఏకం చేయగల సాధనం ఏదీ లేకపోవడం, ఇదే సమయంలో ‘దేశం’ అనే భావనను ప్రజలందరిలో పెంపొందించే అవకాశం ఈ జెండా ద్వారా లభించడంతో దీనికి గాంధీజీ ఆమోదం తెలిపారు. దీనిని స్వాతంత్య్రం అనంతరం జాతీయ పతాకంగా భారత ప్రభుత్వం గుర్తించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ