ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 28, 29వ తేదీలలో గుజరాత్ మరియు తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ముందుగా జూలై 28, గురువారం మధ్యాహ్నం 12 గంటలకు గుజరాత్ సబర్కాంతలోని గధోడా చౌకీలో సబర్ డెయిరీ యొక్క 1000 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం ప్రధాని మోదీ చెన్నైకి చేరుకొని సాయంత్రం 6 గంటలకు చెన్నైలోని జెఎల్ఎన్ ఇండోర్ స్టేడియంలో 44వ చెస్ ఒలింపియాడ్ను ప్రారంభిస్తారు. ఈ 44వ చెస్ ఒలింపియాడ్ చెన్నైలో జూలై 28 నుండి ఆగస్టు 9, 2022 వరకు జరగనుంది. 1927 నుండి నిర్వహించబడుతున్న ఈ ప్రతిష్టాత్మక పోటీలు మొదటిసారిగా భారతదేశంలో మరియు 30 సంవత్సరాల తర్వాత ఆసియాలో నిర్వహించబడుతున్నాయి. మొత్తం 187 దేశాలు పాల్గొంటుండడంతో చెస్ ఒలింపియాడ్లో ఇదే అతిపెద్ద పార్టిసిపేషన్ కానుంది. భారత్ తరఫునుంచి కూడా మొత్తం 6 జట్లతో 30 మంది ఆటగాళ్లతో కూడిన అతిపెద్ద బృందం ఈ పోటీల్లో పాల్గొననుంది.
ఇక జూలై 29, శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రధాని మోదీ ప్రతిష్టాత్మక అన్నా యూనివర్సిటీ 42వ స్నాతకోత్సవానికి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో 69 మంది గోల్డ్ మెడలిస్ట్స్ కు బంగారు పతకాలు, ప్రశంసాపత్రాలు అందజేయనున్నారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు. ఆ తర్వాత ప్రధాని మోదీ మళ్ళీ గుజరాత్ లోని గాంధీనగర్ కు చేరుకొని, అక్కడ గిఫ్ట్ సిటీని (గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-సిటీ) సందర్శించనున్నారు. గిఫ్ట్ సిటీలో ఐఎఫ్ఎస్సీఏ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేయడంతో పాటుగా, భారతదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ బులియన్ ఎక్స్ఛేంజ్(ఐఐబీఎక్స్) కూడా ప్రారంభించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY