హైదరాబాద్ నగరంలో మూడు చోట్ల రూ 95.58 కోట్ల వ్యయంతో నిర్మించిన 1152 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను (జియాగూడ-840, గోడే కి కబర్-192, కట్టెల మండి-120) రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా పేదకుటుంబాలు సౌలభ్యంగా జీవించేందుకు అవసరమైన మౌలిక వసతులు, తాగునీరు, విద్యుత్, రోడ్లు ఇతర సదుపాయాలను ప్రభుత్వం కల్పించిందని అన్నారు. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక వైపు పేదింటి ఆడబిడ్డ పెండ్లికి మేనమామ గా రూ.1 లక్ష 16 వేలు ఇస్తున్నారని, మరోవైపు పేదింట పెద్ద కొడుకుగా పేదలు ఆత్మ గౌరవంగా ఉండేలా రెండు పడక గదులు, ఒక కిచెన్, ఒక హాలులో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి, ఉచితంగా ఇస్తున్నారని చెప్పారు.
నగరంలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తున్నాము. దశల వారీగా లబ్ధిదారులకు కేటాయిస్తాం.1985 లో ప్రారంభించిన బలహీన వర్గాల గృహనిర్మాణ ఇండ్ల నిర్మాణ పథకం క్రింద గత 35 ఏండ్లలో రాష్టంలో 40 లక్షల ఇండ్లు నిర్మించినట్లు లెక్కలు చూపారు. అన్ని ఇండ్లు వాస్తవంగా నిర్మిస్తే ఇండ్లు లేని పేద కుటుంబాలు ఉంటాయా అని మంత్రి కేటిఆర్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించుకోవచ్చని సూచించారు. జియాగూడ కాలనీ లబ్ధిదారులు అందరూ ఒక సోసైటీ గా ఏర్పడి, ప్రజల సౌకర్యార్థం నిర్మించిన 56 షాపుల కాంప్లెక్స్ ల కు వచ్చే అద్దెతో లిఫ్ట్ లు నిర్వహణ, శానిటేషన్ ను రెగ్యులర్ గా చేసుకుని, అందమైన కాలనీగా చూసుకోవాలని చెప్పారు. ఇక్కడ నిర్మించిన ప్రతి డబుల్ బెడ్ రూమ్ కు ప్రభుత్వం రూ 9 లక్షలు వ్యయం చేసింది. మార్కెట్ లో ఈ ఇంటి విలువ రూ.40 లక్షలు ఉంటుందని మంత్రి అన్నారు.
అలాగే ఉచిత వైద్య సేవలు అందించే బస్తీ దవాఖానాతో పాటు అంగన్ వాడి కేంద్రం, లైబ్రరీ ల ఏర్పాటు, గేటెడ్ కమ్మూనిటీ లకు దీటుగా పేదల డిగ్నిటీ కాలనీలలో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. లబ్ధిదారుల ఎంపిక అధికారుల ద్వారా పారదర్శకంగా జరుగుతుంది. ఇండ్లు ఇప్పిస్తామనే దళారులను ప్రజలు నమ్మవద్దు. పేదలు ఆత్మగౌరవంగా జీవించాలనేదే సీఎం కేసీఆర్ సంకల్పం. దేశంలో ఏ రాష్టం చేపట్టని విధంగా రూ.18 వేల కోట్ల వ్యయంతో 2.50 లక్షల రెండు పడక గదుల ఇండ్లు నిర్మిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వంకే చెందుతుంది. పేదల సంక్షేమం కొరకు, ప్రభుత్వంకు ఉన్న చిత్తశుద్ధికి ఇదొక నిదర్శనంగా నిలుస్తుందని మంత్రి కేటిఆర్ పేర్కొన్నారు. డిగ్నిటీ హోసింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు మహ్మద్ మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, నగర ఎమ్మెల్యేలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu