పంజాబ్ రాజకీయాలలో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీ పార్టీలో చేరారు. అదే సమయంలో తాను కొత్తగా ఏర్పాటు చేసిన ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్’ (పిఎల్సి) పార్టీని కూడా బీజేపీలో విలీనం చేశారు. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. కేంద్రమంత్రి కిరణ్ రిజిజు సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. అలాగే మరో కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. అమరీందర్ సింగ్కు బీజేపీ పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు. కాగా దీనికిముందు అమరీందర్ సింగ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం దిశగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
మరోవైపు అమరీందర్తో పాటు బీజేపీలో చేరాలని భావిస్తున్న పార్టీ నేతల జాబితాను ఖరారు చేస్తున్నట్లు పంజాబ్ లోక్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రిత్పాల్ సింగ్ బలియావాల్ తెలిపారు. కాగా పంజాబ్ ఎన్నికలకు ముందు అమరీందర్ సింగ్ దశాబ్దాలుగా కాంగ్రెస్తో ఉన్న అనుబంధాన్ని వదులుకుని, నవంబర్ 2, 2021న ‘పిఎల్సి’ పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ ఎన్నికలలో అనూహ్యంగా అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వం లోని ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ ఘనవిజయం సాధించగా.. కాంగ్రెస్ సహా మిగిలిన పార్టీలు ప్రభావం చూపించలేకపోయాయి. పిఎల్సి రాష్ట్రవ్యాప్తంగా ఘోరపరాజయం పాలైంది. దీంతో అప్పటినుంచి ఆయన బీజేపీ వైపు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఇటీవల వెన్నెముకకు శస్త్ర చికిత్స ముగించుకుని లండన్లో తిరిగి వచ్చిన తర్వాత ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలిశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY