సెప్టెంబర్ 25వ తేదీ నుంచి ప్రారంభంకానున్న బతుకమ్మ ఉత్సవాలను రాష్ట్ర రాజధానితోపాటు అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బతుకమ్మ పండగ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు సోమవారం బి.ఆర్.కె.ఆర్. భవన్ లో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్, పోలీస్ శాఖ డైరెక్టర్ జనరల్ మహేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు డా కె.వి రమణాచారి, సమాచార శాఖ కమీషనర్ అరవింద్ కుమార్ తదితర సీనియర్ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్బంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, ఈనెల 25 తేదీ నుండి అక్టోబర్ 3 వ తేదీ వరకు బతుకమ్మ పండగ ఉంటుందని, సద్దుల బతుకమ్మ జరిగే అక్టోబర్ 3వ తేదీన ట్యాంకుబండ్ వద్ద విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధానంగా బతుకమ్మ ఘాట్, ట్యాంక్ బండ్, పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్య నిర్వహణ, రోడ్డు రిపేర్ వర్క్స్ వెంటనే చేపట్టాలన్నారు. ఈసారి మహిళలు ఉత్సవాలలో భారీ సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందున పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నింటినీ విద్యుత్ దీపాలతో అలంకరించాలని అన్నారు. బతుకమ్మలను నిమ్మజ్జనం చేసే ప్రాంతాల్లో ఏవిధమైన ప్రమాదాలు జరుగకుండా గజ ఈతగాళ్లను నియమించాలని ఆదేశించారు. బతుకమ్మ పండగపై ఆకర్షణీయమైన డిజైన్ లతో మెట్రో పిల్లర్లను అలంకరించాలని పేర్కొన్నారు.
ప్రభుత్వ సలహాదారులు డా.కె.వి రమణాచారి మాట్లాడుతూ, బతుకమ్మ ఉత్సవాలు మన రాష్ట్రానికి ప్రతిష్టాత్మకమైనవని, ఏర్పాట్లను ఘనంగా చేయాలని అధికారులకు సూచించారు. శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 25 వతేది నుంచి ప్రారంభం కానున్నాయని, అందులో భాగంగా బతుకమ్మ ఉత్సవాలు కూడా అదే రోజున ప్రారంభం అవుతాయని ఆయన అన్నారు. 9 రోజుల పాటు జరిగే బతుకమ్మ ఉత్సవాలు నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కోరారు. అక్టోబర్ 3వ తేదిన జరిగే సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించాలని రమణాచారి అధికారులకు సూచించారు
ఇక ఎల్బీ స్టేడియం, నగరంలోని ప్రధాన కూడళ్లలో బతుకమ్మ లోగోలను ఏర్పాటు చేయాలని, నిర్వహణ ఏర్పాట్లు కూడా ఘనంగా ఉండాలని సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశాలు ఇచ్చారు. భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నిర్వాహణ, ట్యాంక్ బండ్ వద్ద విద్యుత్ దీపాలంకరణ, బారికేడింగ్, మంచినీటి సౌకర్యం, మజ్జిగ ప్యాకెట్స్ సరఫరా, మొబైల్ టాయిలెట్స్, నిరంతర విద్యుత్ సరఫరా, ఉత్సవాల లైవ్ టెలికాస్ట్ ప్రసార మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేయాలని సంబంధిత అధికారులను సీఎస్ ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో కార్మిక, ఉపాది శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, జీహెఛ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్, సైబరాబాద్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, వైటీడీఏ చైర్మన్ కిషన్ రావు, మున్సిపల్ పరిపాలనా శాఖ సంచాలకులు సత్యనారాయణ, దేవాదాయశాఖ కమీషనర్ అనీల్ కుమార్, మహిశా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి డి.దివ్య, విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన, హైదరాబాద్ కలెక్టర్ అమయ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY