ప్రపంచ మహిళా బ్యాడ్మింటన్ లో స్వర్ణం పతకం గెలుచుకున్న తోలి భారత షట్లర్ గా తెలుగు తేజం పూసర్ల వెంకట (పీవీ) సింధు కొత్తగా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పీవీ సింధు ఖాతాలో మరో అత్యున్నత పురస్కారం చేరే అవకాశమొచ్చింది. దేశంలో మూడో అత్యుత్తమ పురస్కారమైన పద్మభూషణ్ కోసం పీవీ సింధు పేరును క్రీడా శాఖ ప్రతిపాదించింది. 2015 లో పీవీ సింధు పద్మశ్రీ అవార్డు అందుకుంది, 2017 వ సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డు కోసం పీవీ సింధు పేరును క్రీడాశాఖ ప్రతిపాదించగా అప్పుడు అవార్డుల కమిటీ ఎంపిక చేయలేదు. ఇటీవలే పీవీ సింధు ప్రపంచ ఛాంపియన్ షిప్ గెలుచుకోవడంతో ఈసారి ఖచ్చితంగా పద్మభూషణ్ దక్కుతుందని భావిస్తున్నారు.
మరో వైపు ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ గా నిలిచి ఇప్పటికి సత్తా చాటుతున్న భారత మహిళా బాక్సర్ మేరీకోమ్ పేరును దేశంలో రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ కోసం క్రీడాశాఖ ప్రతిపాదించినట్లు తెలుస్తుంది. 2006 లో పద్మశ్రీ, 2013లో పద్మభూషణ్ అవార్డులు ఆమెను వరించాయి, ఈసారి పద్మ విభూషణ్ వరిస్తే ఈ ఘనత సాధించిన నాలుగో వ్యక్తిగా, సచిన్, విశ్వనాథ్ ఆనంద్ , సర్ ఎడ్మన్డ్ హిల్లరీ సరసన మేరీకోమ్ నిలుస్తారు. పద్మ పురస్కారాలు-2020 కోసం తొమ్మిదిమంది మహిళా క్రీడాకారులతో కూడిన జాబితాను క్రీడాశాఖ అవార్డుల కమిటీకి పంపినట్టు సమాచారం. రెజ్లర్ వినేష్ పొగట్, టేబుల్ టెన్నిస్ స్టార్ క్రీడాకారిణి మానిక బత్రా, క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్, హాకీ కెప్టెన్ రాణి రాంపాల్, మాజీ షూటర్ సుమ శిరూర్, పర్వతారోహకులు తాషీ, నుంగ్షి మాలిక్ ల పేర్లను పద్మశ్రీ పురస్కారాల కోసం క్రీడాశాఖ ప్రతిపాదించినట్లు తెలుస్తుంది.
[subscribe]
[youtube_video videoid=wraQ0uGni_w]