టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం నాడు తెలంగాణ భవన్ లో పార్టీ కార్యదర్శులు, రాష్ట్ర కార్యదర్శులతో సమావేశమయ్యారు. మంత్రిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించాక తెలంగాణ భవన్ కు వచ్చిన కేటీఆర్ కు పార్టీ శ్రేణులు పెద్దఎత్తున స్వాగతం పలికాయి. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, టిఆర్ఎస్ పార్టీలో క్రమశిక్షణా రాహిత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని, ఎంతటి వారైనా అలాంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించబోమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని సామాజిక కోణాలను పరిగణనలోకి తీసుకుని మంత్రివర్గ విస్తరణ చేపట్టారని, నాయకులు ఎవరికీ తోచిన విధంగా వారు మాట్లాడడం మంచి పద్ధతి కాదని చెప్పారు. త్వరలోనే పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించి, నాయకుల వ్యాఖ్యలపై చర్చించి తగిన చర్యలు తీసుకుంటారని చెప్పారు.
ఈ సమావేశంలో త్వరలో జరగబోయే పురపాలక ఎన్నికలపై చర్చించారు. పురపాలక ఎన్నికల టిక్కెట్లను తామే ఇస్తామంటూ కొందరు పార్టీ ప్రధాన కార్యదర్శులు ప్రచారం చేసుకుంటున్నారని మంత్రులు ఫిర్యాదు చేసారని, ఇలాంటి చర్యలను పార్టీ సహించబోదని చెప్పారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, పార్టీ అధిష్టానమే టిక్కెట్ల విషయంలో నిర్ణయం తీసుకుంటుంది అని అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సన్నద్ధంగా ఉండి, పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు. కష్టపడి పనిచేస్తూ, పార్టీ ఎదుగుదలకు పాటుపడే నాయకులు,కార్యకర్తలందరికీ తప్పకుండా పదవులు వస్తాయని చెప్పారు. ఇకపై ప్రతినెలా రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహిస్తామని కేటీఆర్ ప్రకటించారు, సమావేశంలోని వివరాలను బహిర్గతం చేయకూడదని ఆయన కార్యదర్శులకు సూచించారు.
[subscribe]
[youtube_video videoid=hw779tRZ8m0]