ప్రముఖ సినీనటుడు, సూపర్స్టార్ రజనీకాంత్ తన రాజకీయరంగ ప్రవేశంపై సోమవారం నాడు మరోసారి స్పష్టత ఇచ్చారు. తాను రాజకీయాల్లోకి రావట్లేదని, భవిష్యత్తులో కూడా అలాంటి ప్రణాళికలు ఏమి లేవని రజనీకాంత్ వెల్లడించారు. సోమవారం నాడు చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణమండపంలో రజనీ మక్కళ్ మండ్రం (ఆర్ఎంఎం) నిర్వాహకులతో రజనీకాంత్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గత కొంతకాలంగా రజనీ మక్కళ్ మండ్రం సభ్యుల్లో తన రాజకీయ అరంగేట్రంపై ఉన్న సందేహాలను రజనీకాంత్ నివృత్తి చేశారు. కోవిడ్ పరిస్థితులు, ఎన్నికలు, సినిమా షూటింగ్ తో పాటుగా యుఎస్ లో మెడికల్ చెక్-అప్ కారణంగా గతకొంతకాలం నుంచి ఆర్ఎంఎం సభ్యులను కలవలేకపోయానని చెప్పారు. అలాగే రజనీ మక్కళ్ మండ్రంను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ స్థానంలో రజనీ అభిమాన సంక్షేమ మండ్రం ఏర్పాటు చేస్తున్నానని, ఆర్ఎంఎం ఆఫీస్ బేరర్లు ఇకపై దీని ద్వారా ప్రజా సేవలో పాల్గొంటారని రజనీకాంత్ వెల్లడించారు.
ముందుగా డిసెంబర్ 29,2020న అనారోగ్యం కారణాల దృష్ట్యా రాజకీయ పార్టీ పెట్టడం లేదని రజనీకాంత్ ప్రకటించారు. “ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో పార్టీ ప్రారంభించవద్దని నిర్ణయించుకున్నాను. ఆరోగ్యం దృష్ట్యా ఆత్మీయులు కూడా వద్దని సలహా ఇచ్చారు. రాజకీయాల్లోకి రాలేనని ఎంతో భారమైన హృదయంతో చెబుతున్నా. రాజకీయాలతో సంబంధం లేకుండా ఎప్పటిలాగానే ప్రజాసేవను కొనసాగిస్తాను” అని రజనీకాంత్ ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ