ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో జరిగిన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపిసి) మూడు రోజుల సమావేశం నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో ఈ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ఉదయం వెల్లడించారు. కీలక వడ్డీ రేట్లపై యథాతథస్థితిని కొనసాగిస్తామని తెలిపారు. రెపో రేటు, రివర్స్ రెపో రేట్లలో ఎలాంటి మార్పులు లేవన్నారు. ప్రస్తుతమున్న 4 శాతం రెపో రేటు, 3.35 శాతం రివర్స్ రెపో రేటు అలాగే అమలు కానున్నట్లు తెలిపారు. దీంతో వరుసగా పదకొండో సారి కూడా కీలక పాలసీ రేట్లపై యథాతథస్థితి కొనసాగనుంది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఉన్న సమయంలో మే 22, 2020న రెపో రేటు చివరిసారిగా తగ్గించబడింది. ఇక అప్పటి నుండి 4 శాతం వద్దనే కొనసాగుతుంది. కోవిడ్ మహమ్మారి ప్రభావం అనంతరం దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు.
ఇక 2022-23 ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) వృద్ధిని గతంలో ప్రకటించిన 7.8 శాతం నుంచి 7.2 శాతానికి ఆర్బీఐ సవరించింది. అలాగే 2022-23కి ద్రవ్యోల్బణాన్ని కూడా గతంలో అంచనా వేసిన 4.5 శాతం నుంచి 5.7 శాతానికి సవరించినట్టు ప్రకటించారు. మరోవైపు పలు రకాల మోసాలను నిరోధించడానికి యూపీఐ ద్వారా దేశంలో అన్ని బ్యాంకు శాఖలు మరియు ఏటీఎంల వద్ద కార్డ్లెస్ నగదు విత్ డ్రా సౌకర్యాన్ని అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. పేమెంట్ వ్యవస్థలను మరింత రక్షణగా బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ