భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి మరింతగా ప్రభావం చూపుతుంది. దేశంలో ఇప్పటికే 9352 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, ఈ వైరస్ వలన 324 మంది మరణించారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పేదలకు ఆహార ధాన్యాలు సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి మరోసారి లేఖ రాశారు. పేదలకు చేయూతనిచ్చే ఉచిత సరఫరా పథకం బాగుందని, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ పథకాన్ని మూడునెలల పాటు పొడిగించి సెప్టెంబరు వరకు కొనసాగించాలని ప్రధాని మోదీని కోరారు.
లాక్డౌన్ కారణంగా ఎక్కడిక్కడే ఉండిపోయిన కూలీల వద్ద ఆహార భద్రత కార్డులు ఉండే అవకాశం లేదని, వారికి కూడా జాతీయ ఆహార భద్రతా చట్టం ద్వారా ఒక్కో వ్యక్తికీ 5 కేజీల ఆహారధాన్యాలు అందించే పథకాన్నివర్తింప చేయాలని సూచించారు. దీర్ఘకాలిక లాక్డౌన్ ప్రభావం, ఆహార ద్రవ్యోల్బణం వంటి విషయాలను దృష్టిలో పెట్టుకునే ఈ సూచనలు చేశామని సోనియాగాంధీ తన లేఖలో వివరించారు. రాష్ట్రాల మధ్య రవాణా సమస్యలు ధరల పెరుగుదలకు కారణం కాకుండా చూడాలని, రాష్ట్రాలకు పూర్తీ స్థాయిలో ఆహార పదార్థాల సరఫరా ఉండేలా చూడాలని చెప్పారు. ఇలాంటి ప్రతికూల సమయాల్లో ఉపయోగపడే విధంగా ఎఫ్ సీఐ నిల్వల సామర్థ్యం పెంచుకునేలా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆమె లేఖలో పేర్కొన్నారు. అలాగే ఇటీవలే దేశంలో కరోనా వైరస్ కట్టడికి 5 కీలక సూచనలతో సోనియా గాంధీ ప్రధాని మోదీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu