దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా వేయాలని 11 రాష్ట్రాలకు చెందిన 11 మంది విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్పై ఆగస్టు 17, సోమవారం నాడు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ నెలలోనే నీట్, జేఈఈ పరీక్షలు జరుగుతాయని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కరోనా పరిస్థితులను అడ్డంపెట్టుకుని పరీక్షలను వాయిదా వేయలేమని త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది.
అన్ని జాగ్రత్తలు, భద్రతా విధానాలతో ముందుకు సాగాలి, విద్యార్థులు ఈ ఏడాదిని వృథా చేయడానికి సిద్ధంగా ఉన్నారా?, కోవిడ్ పరిస్థితులు మరికొంతకాలం కొనసాగే అవకాశం ఉంది. అప్పటివరకు వేచి చూస్తారా, దేశానికి జరిగే నష్టం, విద్యార్థులకు కలిగే అపాయం, వారి భవిష్యత్ పై పడే ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకోవాలని ధర్మాసనం పేర్కొంటూ, పరీక్షల వాయిదాపై దాఖలైన పిటిషన్ ను కొట్టివేసింది. తాజా కోర్టు నిర్ణయంతో సెప్టెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు జేఈఈ మెయిన్స్, సెప్టెంబర్ 13న నీట్ పరీక్ష జరగనున్నాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu