2018 భీమా కోరేగావ్ కేసులో నిందితుడుగా ఉన్న ఉద్యమకారుడు, విరసం నేత వరవరరావుకు సుప్రీంకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. వరవరరావుకు పూర్తిగా వైద్య కారణాల వలనే బెయిల్ మంజూరు చేయడం జరిగిందని జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. స్పెషల్ ఎన్ఐఏ కోర్టు అనుమతి లేకుండా గ్రేటర్ ముంబయి దాటి వెళ్లకూడదని, అలాగే వరవరరావు తనకి ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయకూడదని, ఈ కేసులో సాక్షులు ఎవరితోనూ టచ్లో ఉండకూడదని కోర్టు పేర్కొంది.
ప్రస్తుతం వైద్యపరమైన కారణాలతో మధ్యంతర బెయిల్పై ఉన్న వరవరరావు, శాశ్వత వైద్య బెయిల్ కోసం వేసిన పిటిషన్ను బాంబే హైకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఆయన బాంబే హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేయగా, విచారణ అనంతరం షరతులతో కూడిన శాశ్వత వైద్య బెయిల్ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. ముందుగా భీమా కోరేగావ్ కేసుకు సంబంధించి ఆగస్టు 28, 2018న హైదరాబాద్లోని నివాసంలో వరవరరావును పూణే పోలీసులు అరెస్టు చేశారు. యూఏపీఏ చట్టంలోని వివిధ సెక్షన్ల ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆతర్వాత నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఈ కేసులో విచారణ చేపట్టింది. 2021 ఫిబ్రవరి 21న ఆయనకు మధ్యంతర బెయిల్ వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా వైద్య కారణాలతో వరవరరావుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు అయింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY