రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీమిండియా వికెట్ కీపర్-బ్యాటర్ రిషభ్ పంత్ కోలుకుంటున్నాడు. రిషభ్ పంత్ ప్రస్తుతం ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్ అండ్ మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం రిషభ్ పంత్ కు మోకాలి శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. పంత్ కుడి మోకాలి లిగ్మెంట్ గాయానికి సర్జరీ జరిగిందని, ప్రస్తుతం అతను వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని మరియు వేగంగా కోలుకుంటున్నాడని సంబంధిత వర్గాలు తెలిపాయి.
డిసెంబరు 30న ఉత్తరాఖండ్లోని రూర్కీ సమీపంలో కారు ప్రమాదంలో గాయపడిన పంత్ ముందుగా సక్షం హాస్పిటల్ మల్టీస్పెషాలిటీ మరియు ట్రామా సెంటర్లో చేరాడు, అక్కడ అతను ప్రభావ గాయాలకు చికిత్స పొందాడు. ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉన్న అనంతరం డెహ్రాడూన్లోని మాక్స్ హాస్పిటల్కి తరలించబడ్డాడు, అక్కడ ఎంఆర్ఐ స్కాన్లను నిర్వహించి, అతని గాయాలు ఎంతవరకు ఉన్నాయో తెలుసుకుని, తదుపరి చికిత్సను నిర్ణయించారు. ఈ క్రమంలో డెహ్రాడూన్లోని మ్యాక్స్ హాస్పిటల్ నుంచి గాయాలతో చికిత్స పొందుతున్న రిషభ్ పంత్ ను ఎయిర్ అంబులెన్స్లో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్ కు తరలించింది.
ఈ సందర్భంగా బీసీసీఐ ప్రకటన చేస్తూ, “రిషభ్ కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్ మరియు మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో చేరి, స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్ హెడ్ డాక్టర్ దిన్షా పార్దివాలా మరియు హాస్పిటల్లో ఆర్థ్రోస్కోపీ అండ్ షోల్డర్ సర్వీస్ డైరెక్టర్ యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉంటాడు. రిషభ్ కు శస్త్రచికిత్స మరియు లిగ్మెంట్ గాయాల కోసం తదుపరి ప్రక్రియలు జరుగుతాయి. అతను కోలుకోవడం మరియు పునరావాసం అంతా బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో కొనసాగుతుంది. రిషభ్ రికవరీ ప్రక్రియను వేగవంతం చేయడానికి బోర్డు అన్ని ప్రయత్నాలు చేస్తుంది మరియు ఈ సమయంలో అతనికి అవసరమైన సహాయం అంతా బోర్డు అందిస్తుంది” అని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రిషభ్ పంత్ కు మోకాలి లిగ్మెంట్ సర్జరీ విజయవంతంగా పూర్తిచేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE