మరో వారం రోజుల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. రాష్ట్ర కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేసింది. మంగళవారం సర్వ జనాంగద శాంతియ తోట పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పన, మహిళలకు సాధికారత, పేదరికాన్ని నిర్మూలించడం వంటి కీలక అంశాలపై కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రాధాన్యత కల్పించామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. మేనిఫెస్టోలో ముఖ్యంగా మహిళలు, నిరుద్యోగులే లక్ష్యంగా పలు హామీలు గుప్పించింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలు మరియు నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు నెలవారీ భత్యాలు మొదలైనవాటిని ప్రస్తావించింది.
కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన కొన్ని కీలక హామీలు..
- ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఆమోదించిన అన్ని ‘అన్యాయమైన మరియు ప్రజా వ్యతిరేక చట్టాలను’ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరంలోపు రద్దు.
- 2006లో చేరిన ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్) కల్పించే దిశగా చర్యలు.
- ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను ఒక సంవత్సరంలోగా భర్తీ చేయడంపై దృష్టి.
- ఒక్కో కుటుంబానికి నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.
- శక్తి పథకం కింద మహిళలకు కేఎస్ఆర్టీసీ, బీఎంటీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం.
- గృహలక్ష్మి పథకం కింద కుటుంబంలోని మహిళకు నెలకు రూ. 2,000.
- నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.3,000, డిప్లొమా ఉన్నవారికి నెలకు రూ.1,500 చొప్పున భృతి.
- దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న ప్రతి ఒక్కరికీ అన్నభాగ్య పథకం కింద నెలకు పది కేజీల ఆహార ధాన్యాలు అందజేత.
- గృహ జ్యోతి, గృహ లక్ష్మి, యువ నిధి, శక్తి, అన్న భాగ్య పథకాల ద్వారా సంక్షేమం అమలు.
- పాడి రైతులకు ఆవులు, గేదెలు కొనుగోలు కోసం రూ.3 లక్షలు వడ్డీ లేని రుణాలు.
- ప్రతి డివిజన్ లో కర్ణాటక ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడే నందిని డెయిరీ సహకారంతో పాలిటెక్నీక్స్ ఏర్పాటు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE