తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో గవర్నర్ తమిళిసై సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో తాజా పరిస్థితులు సహా అనేక అంశాలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. ఇటీవల కొన్ని పరిణామాల దృష్ట్యా గవర్నర్ కు, సీఎం కేసీఆర్ మధ్య విభేదాలు ఏర్పడ్డట్టు చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.
రాష్ట్రంలో గవర్నర్ పర్యటనల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనలు, గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాల నిర్వహణ, రాజ్భవన్ లో ఉగాది వేడుకలకు ఆహ్వానించినా సీఎం, మంత్రులు ఎవరూ హాజరుకాకపోవడం వంటి అంశాలను ప్రధానికి వివరించి, చర్చించినట్టు సమాచారం. ఓవైపు సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలోనే ఉండడం, కొన్ని రోజులుగా తెలంగాణలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో గవర్నర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు నేడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో కూడా గవర్నర్ తమిళిసై భేటీ అయి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ