టోక్యో ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. భారత బాక్సర్ లవ్లీనా బొర్గోహెన్ కాంస్య పతకం కైవసం జరిగింది. 69 కేజీల విభాగంలో బుధవారం ఉదయం జరిగిన సెమీఫైనల్లో టర్కీ బాక్సర్ బుసెనాజ్ సుర్మనెలితో లవ్లీనా హోరాహోరిగా పోరాడింది. అయితే ప్రపంచ ఛాంపియన్ అయిన సుర్మనెలి మూడు రౌండ్లలోనూ ఆధిపత్యం చూపించి 5-0 తేడాతో విజయం సాధించింది. దీంతో లవ్లీనా కాంస్యానికి పరిమితమైంది. ఒలింపిక్స్ లో భారత్ తరపున పతకం గెలుచుకున్న మూడో బాక్సర్ గా లవ్లీనా చరిత్ర సృష్టించింది. ఇంతకు ముందు 2008లో విజేందర్ సింగ్, 2012లో మేరీ కోమ్ బాక్సింగ్ లో కాంస్య పతకాలు సాధించారు. అస్సాంకు చెందిన 23 ఏళ్ల లవ్లీనా ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనడం ఇదే మొదటిసారి. బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్ లో రెండుసార్లు కాంస్య పతకం గెలుచుకున్న లవ్లీనా, తాజాగా ఒలింపిక్స్ లోనూ కాంస్యం సొంతం చేసుకుంది. దీంతో టోక్యో ఒలింపిక్స్-2020లో భారత్ పతకాల సంఖ్య మూడుకు చేరుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ