ప్రధాని నరేంద్ర మోదీతో జనవరి 6, సోమవారం నాడు దేశంలోని పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తల భేటీ అయ్యారు. ఫిబ్రవరి 1న 2020-21 సంవత్సరానికిగానూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమర్పించనుంది. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కుంటున్న సంక్షోభ పరిస్థితులపై చర్చించే దిశగానే ఈ కీలక సమావేశం జరిగినట్టుగా తెలుస్తుంది. ప్రధాని మోదీ కార్యాలయంలో జరిగిన ఈ భేటీకి టాటా సన్స్ ఛైర్మన్ రతన్ టాటా, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, టెలికం దిగ్గజం సునీల్ మిట్టల్, అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ, జెఎస్డబ్ల్యు గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ తోపాటుగా పలువురు పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు.
ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని పరిష్కరించే దిశగా కార్పొరేట్ పన్నును గణనీయంగా తగ్గిస్తూ కేంద్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దేశ ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం కలిగించేందుకు ఎలాంటి పద్ధతులు అనుసరించాలి, సలహాలు, సూచనలపై కీలకంగా చర్చించినట్టు తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టె ముందుగా పలు వర్గాలకు చెందిన ప్రముఖులు, పారిశ్రామికవేత్తలతో ప్రధాని మోదీ గత కొన్ని రోజులుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. గతవారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ రజనీష్ కుమార్, కోటక్ మహీంద్రా బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఉదయ్ కోటక్ వంటి పారిశ్రామికవేత్తలను కూడా మోదీ కలుసుకున్నారు. ఆర్థిక వృద్ధి అంశంతో పాటుగా దేశంలో ఉద్యోగాల రూపకల్పనపై తీసుకోవాల్సిన చర్యలపై ఈ భేటీల్లో చర్చిస్తున్నారు.
[subscribe]