అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపడుతున్న ఆందోళనలు, నిరసన దీక్షలు 21వ రోజుకు చేరుకున్నాయి. ఆందోళనంలో భాగంగా జనవరి 7, మంగళవారం నాడు చినకాకాని వద్ద జాతీయ రహదారి దిగ్బంధం కార్యక్రమానికి రైతులు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. రైతులకు మద్దతుగా జాతీయ రహదారి దిగ్బంధంలో పాల్గొనేందుకు వెళ్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ను పోలీసులు అరెస్టు చేశారు. నారా లోకేశ్తో పాటుగా, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను విజయవాడ నగరంలోని బెంజిసర్కిల్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాజధాని అమరావతి తరలింపుకు నిరసనగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేపట్టిన 24 గంటల రిలే నిరాహార దీక్షలో పాల్గొని వెళ్తుండగా లోకేశ్ ను పోలీసులు అడ్డుకున్నారు. లోకేష్, కొల్లు రవీంద్రలను ఏ స్టేషన్ కు తరలిస్తున్నారనే విషయం ఇంకా తెలియరాలేదు. రైతులు చేపట్టే రహదారి దిగ్బంధన కార్యక్రమానికి టీడీపీ మద్దతు ప్రకటించడంతో, పలువురు టీడీపీ నాయకులను ఉదయం నుంచే పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మరోవైపు చినకాకాని చేరుకున్న రైతులను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పోలీసులు, రైతులకు మధ్య వాగ్వాదం జరుగుతుండడంతో ఆప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
[subscribe]