ఉక్రెయిన్ పై రష్యా మిలిటరీ ఆపరేషన్ చేపట్టడంతో ఆ దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు, పౌరుల తరలింపుపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం నాడు రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్లో ముఖ్యంగా చాలా మంది భారతీయ విద్యార్థులు చిక్కుకున్న ఖార్కివ్ నగరంలో పరిస్థితిని ఇరువురు నాయకులు సమీక్షించినట్టు తెలిపారు. అలాగే పలు సంఘర్షణ ప్రాంతాల నుంచి భారతీయులను సురక్షితంగా తరలించడంపై కూడా వారు చర్చించారని ప్రధాని కార్యాలయం వెల్లడించింది.
మరోవైపు ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ నుండి భారతీయుల తరలింపు ప్రక్రియపై కేంద్ర మంత్రులు మరియు విదేశాంగ కార్యదర్శితో సహా సీనియర్ అధికారులతో ప్రధాని మోదీ బుధవారం కూడా సమీక్ష నిర్వహించారు. భారతీయ విద్యార్థుల భద్రతకు భరోసా ఇవ్వడం, వారిని సురక్షితంగా దేశానికి తీసుకురావడమే ప్రధాన కర్తవ్యంగా పెట్టుకోవాలని అధికారులకు ప్రధాని మోదీ ఇటీవలే ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ వరుసగా సమావేశాలను నిర్వహిస్తూ తరలింపు ప్రక్రియను సమీక్షిస్తున్నారు.
ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను పొరుగు దేశాలైన రొమేనియా, హంగరి, పోలాండ్, స్లోవాక్ రిపబ్లిక్ లకు తరలించి, అక్కడి నుంచి స్వదేశానికి తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ నుంచి పొరుగుదేశాలకు చేరుకోవాలని ఇండియన్ ఎంబసీ మొదటిసారి సూచన జారీచేసినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 17000 మంది భారతీయులు ఉక్రెయిన్ సరిహద్దు దాటారని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే రానున్న 24 గంటల్లో భారతీయుల తరలింపుకు 15 విమానాలు షెడ్యూల్ చేయబడ్డాయని తెలిపారు. భారత వైమానిక దళానికి చెందిన C-17 విమానాలను కూడా తరలింపు ప్రక్రియ కోసం వినియోగిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ