దేశ ప్రజలు ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్నా కేంద్ర బడ్జెట్ 2023-24 ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు (ఫిబ్రవరి 1, బుధవారం) ఉదయం లోక్ సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందుగా సంప్రదాయాన్ని అనుసరించి నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రులు డాక్టర్ భగవత్ కిషన్రావ్ కరద్, పంకజ్ చౌదరి మరియు ఆర్థిక మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమా వేశమయ్యారు. తర్వాత పార్లమెంట్ కు చేరుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో బడ్జెట్ కు ఆమోదముద్ర వేశారు.
అనంతరం లోక్సభలో ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ వరుసగా ఐదోసారి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చివరి పూర్తి బడ్జెట్ ఇదే కావడంతో బడ్జెట్ పై దేశవ్యాప్తంగా పలు వర్గాల్లో చర్చ జరుగుతుంది. కాగా కేంద్ర బడ్జెట్ ను ఈసారి కూడా సాంప్రదాయ బహీఖాతా రూపంలో కాకుండా ఎరుపు రంగు పౌచ్ లో ఉంచిన టాబ్లెట్ ద్వారా నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను పార్లమెంటుకు తీసుకొచ్చారు.
2023-24 కేంద్ర బడ్జెట్ అంచనాలు:
- రుణాలు కాకుండా మొత్తం వసూళ్లు రూ.27.2 లక్షల కోట్లుగా అంచనా
- మొత్తం వ్యయం రూ. 45 లక్షల కోట్లుగా అంచనా
- నికర పన్ను వసూళ్లు రూ.23.3 లక్షల కోట్లుగా అంచనా
- ద్రవ్య లోటు జీడీపీలో 5.9 శాతంగా అంచనా
- 2023-24లో ద్రవ్య లోటును పూడ్చేందుకు, డేటెడ్ సెక్యూరిటీల నుండి నికర మార్కెట్ రుణాలు రూ. 11.8 లక్షల కోట్లుగా అంచనా
- స్థూల మార్కెట్ రుణాలు రూ.15.4 లక్షల కోట్లుగా అంచనా.
కేంద్ర బడ్జెట్ 2023-24 ముఖ్యాంశాలు :
- ఆదాయపన్నులపై కీలక నిర్ణయం, ప్రస్తుతమున్న రూ.5 లక్షల ఆదాయ పన్ను పరిమితిని రూ.7 లక్షలకు పెంచుతున్నట్టు ప్రకటన. కాగా ఇది కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికీ మాత్రమే వర్తింపు.
- 2020లో కొత్త వ్యక్తిగత ఆదాయపు పన్ను విధానాన్ని 6 ఆదాయ స్లాబ్లతో రూ.2.5 లక్షల నుండి ప్రారంభించాం. తాజాగా స్లాబ్ల సంఖ్యను 5కి తగ్గించి, పన్ను మినహాయింపు పరిమితిని రూ.3 లక్షలకు పెంచుతున్నాం
- ఇకపై కొత్త పన్ను రేట్లు ప్రకారం వ్యక్తిగత ఆదాయపు పన్ను విధానం: 0 నుండి రూ.3 లక్షలు- నిల్, రూ.3 లక్షల నుండి 6 లక్షలు వరకు 5శాతం రూ.6 లక్షలనుండి 9 లక్షల వరకు – 10 శాతం, రూ.9 లక్షల నుండి 12 లక్షలు వరకు – 15 శాతం, రూ.12 లక్షల నుండి 15 లక్షల వరకు – 20 శాతం, 15 లక్షల కంటే ఎక్కువ – 30 శాతం.
- ఆదాయపు పన్ను రిటర్నుల కోసం సగటు ప్రాసెసింగ్ సమయం 93 రోజుల నుండి 16 రోజులకు తగ్గింపు
- అమృత కాలంలో ఇది తొలి బడ్జెట్, భారత ఆర్థిక వ్యవస్థ సరైన మార్గంలో ఉంది మరియు ఉజ్వల భవిష్యత్తు వైపు పయనిస్తోంది.
- రూ.2 లక్షల కోట్ల వ్యయంతో ఉచితంగా ఆహార ధాన్యం సరఫరా చేసే పథకాన్ని అమలు చేస్తున్నాం. కోవిడ్ మహమ్మారి సమయంలో 80 కోట్ల మందికి పైగా ప్రజలకు 28 నెలల పాటు ఉచిత ఆహార ధాన్యాలను సరఫరా
- బడ్జెట్-2023లో ఏడు ప్రాధాన్యతలు: సమ్మిళిత అభివృద్ధి, రీచింగ్ ది లాస్ట్ మైల్, మౌలిక సదుపాయాలు-పెట్టుబడి, సంభావ్యతను ఆవిష్కరించడం, గ్రీన్ గ్రోత్, యూత్ పవర్, ఆర్థిక రంగం.
- స్వచ్ఛ్ భారత్ మిషన్ కింద 11.7 కోట్ల గృహ మరుగుదొడ్లు
- ఉజ్జ్వల యోజన కింద 9.6 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు
- 2014 నుంచి ఏర్పాటైన 157 మెడికల్ కాలేజీలతో కలిపి 157 కొత్త నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు
- గ్రామీణ ప్రాంతాల్లో అగ్రి-టెక్ స్టార్టప్లకు మద్దతుగా అగ్రికల్చర్ యాక్సిలరేటర్ ఫండ్ను ఏర్పాటు
- ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం కేంద్ర ప్రభుత్వం 38,800 మంది ఉపాధ్యాయులను నియమించనుంది
- పిల్లలు మరియు యువత కోసం జాతీయ డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు
- ప్రధానమంత్రి ఆవాస్ యోజన 48 వేల కోట్ల (66%) నుండి రూ.79,000 కోట్లకు పెంపు
- మూలధన పెట్టుబడి 33% పెరిగి రూ.10 లక్షల కోట్లకు చేరిక, ఇది జీడీపీలో 3.3%
- మూలధన వ్యయం రూ.2.40 లక్షల కోట్లు. ఇది 2013లో చేసిన వ్యయం కంటే 9 రెట్లు ఎక్కువ
- రాష్ట్ర ప్రభుత్వాలకు 50 ఏళ్ల వడ్డీ లేని రుణాన్ని మరో ఏడాది పొడిగింపు
- గిరిజన సమూహాల సామాజిక-ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి పీఎంపీబీటీజీ అభివృద్ధి మిషన్ ప్రారంభం. వచ్చే 3 సంవత్సరాలలో ఈ పథకం అమలుకు రూ.15,000 కోట్లు
- 2,516 కోట్ల పెట్టుబడితో 63,000 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు కంప్యూటరీకరణ కూడా ప్రారంభం
- ఎంఎస్ఎంఈలు విఫలమైన సందర్భాల్లో జప్తు చేసిన మొత్తంలో 95% ప్రభుత్వం వారికి తిరిగి ఇస్తుంది
- ఎంఎస్ఎంఈలకు ముందస్తు పన్ను రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్లకు పెంపు
- ప్రభుత్వ ఏజెన్సీల అన్ని డిజిటల్ సిస్టమ్లకు పాన్ కార్డు ను సాధారణ ఐడెంటిఫైయర్గా ఉపయోగించవచ్చు
- రైల్వేలు: వచ్చే ఆర్థిక సంవత్సరంలో రైల్వేలకు మూలధన వ్యయం రూ.2.40 లక్షల కోట్లు
- ప్రాంతీయ ఎయిర్ కనెక్టివిటీని మెరుగుపరచడానికి 50 అదనపు విమానాశ్రయాలు, హెలిపాడ్లు, వాటర్ ఏరో డ్రోన్లు, అధునాతన ల్యాండింగ్ గ్రౌండ్లు పునరుద్ధరణ
- ఈ-కోర్టుల ప్రాజెక్టు 3వ దశ కోసం రూ.7 వేల కోట్ల నిధులు
- నేషనల్ హైడ్రోజన్ మిషన్ కు రూ.19,700 కోట్లు
- ప్రత్యామ్నాయ ఎరువుల అభివృద్ధికి గోవర్దన్ పథకం అమలు
- మిషన్ కర్మయోగితో ప్రభుత్వ ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధి పెంపు
- 5జీ సర్వీసులతో యాప్ల అభివృద్ధి కోసం ఇంజినీరింగ్ కళాశాలల్లో వంద ల్యాబ్స్ ఏర్పాటు
- లద్దాఖ్ లో 13 గిగావాట్ల విద్యుదుత్పత్తికి రూ.20,700 కోట్ల పెట్టుబడి
- పీఎం మత్స్యసంపద యోజనకు అదనంగా మరో రూ.6 వేల కోట్లతో స్పెషల్ పథకం
- ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0: అంతర్జాతీయ అవకాశాల కోసం యువత నైపుణ్యం పెంచేందుకు వివిధ రాష్ట్రాలలో 30 స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లు ఏర్పాటు
- నీతి ఆయోగ్ కు మరో మూడేళ్లు పొడిగింపు
- దేశీయ, అంతర్జాతీయ టూరిజం కోసం మొత్తం ప్యాకేజీగా అభివృద్ధి చేయడానికి 50 పర్యాటక ప్రాంతాల ఎంపిక
- రాబోయే 3 సంవత్సరాల్లో కోటి మంది రైతులకు సహజ వ్యవసాయం చేసేందుకు సహాయం, 10,000 బయో ఇన్పుట్ వనరుల కేంద్రాలు ఏర్పాటు
- సీనియర్ సిటిజన్స్ డిపాజిట్ స్కీం: రూ.15 నుంచి రూ.30 లక్షలకు పెంపు
- మహిళలు, బాలికల కోసం మహిళా సమ్మాన్ బచత్ పత్ర పథకం అమలు
- సిగరెట్లపై కస్టమ్ డ్యూటీ పెంపు, కెమెరా లెన్స్ వంటి కొన్ని భాగాలు అండ్ ఇన్పుట్ల దిగుమతిపై కస్టమ్స్ సుంకంపై రిలీఫ్.
- బ్యాటరీల కోసం లిథియం-అయాన్ సెల్లపై రాయితీ సుంకం మరో సంవత్సరం కొనసాగింపు, టీవీల తయారీలో ఉపయోగించే టీవీ ప్యానెళ్ల ఓపెన్ సెల్ల భాగాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 2.5%కి తగ్గింపు, ముడి గ్లిజరిన్పై 5 శాతం కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు
- వస్త్రాలు మరియు వ్యవసాయం కాకుండా ఇతర వస్తువులపై బేసిక్ కస్టమ్ డ్యూటీ రేట్ 21 నుండి 13కి తగ్గింపు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE