ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్సింగ్ బిష్త్ ఏప్రిల్ 20, సోమవారం ఉదయం 10.44 గంటలకు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. మూత్రపిండాల సమస్యతో బాధపడుతూ నెల రోజుల క్రితం ఆయన ఎయిమ్స్ లో చేరారు. “గౌరవనీయులైన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఈ ఉదయం 10.44 గంటలకు స్వర్గస్థులయ్యారు. వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి’ అంటూ ఉత్తరప్రదేశ్ అదనపు ప్రధాన కార్యదర్శి అవినాశ్ అవస్థి ఒక ప్రకటన విడుదల చేశారు. ఉత్తరాఖండ్లోని పావ్రి జిల్లాలో ఉన్న స్వగ్రామంలో రేపు (మంగళవారం) అంత్యక్రియలు నిర్వహించనున్నారని తెలిపారు.
తన తండ్రి ఆనంద్ సింగ్ భిష్త్ మృతి పట్ల సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే కరోనా ముప్పు నుంచి ఉత్తర్ప్రదేశ్ ప్రజలను రక్షించే క్రమంలో తన తండ్రి అంత్యక్రియలకు హాజరుకావడం లేదని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. “మా నాన్నగారి మరణవార్త విని ఎంతో బాధపడ్డాను. విశ్వసనీయతతో నిస్వార్థంగా సేవ చేయాలనీ మా నాన్న ఎప్పుడూ చెప్తుండేవారు. చివరి క్షణాల్లో నేను ఆయన పక్కనే ఉండాల్సింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన్ను కడసారి చూసేందుకు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించలేను. అంత్యక్రియల సమయంలో కూడా లాక్డౌన్ నియమావళిని ఉల్లఘించకూడని నా తల్లికి, బంధువులకు విజ్ఞప్తి చేస్తున్నాను. లాక్డౌన్ ముగిసిన అనంతరం ఇంటికి వెళ్తానని” యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా, ఎస్పీ నాయకుడు అఖిలేశ్ యాదవ్, పలువురు కేంద్రమంత్రులు, స్థానిక బీజేపీ నాయకులు సీఎం యోగి ఆదిత్యనాథ్ తండ్రి మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu