ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. గురువారం యూపీ నుంచి ఢిల్లీ చేరుకున్న సీఎం యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం ఉదయం 7 లోక్ కళ్యాణ్ మార్గ్ లోని ప్రధాని అధికార నివాసంలో ప్రధాని మోదీని కలిశారు. వీరిద్దరి సమావేశం గంటకుపైగా కొనసాగినట్టు తెలుస్తుంది. భేటీ అనంతరం సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ చేస్తూ, “ఈ రోజు ప్రధాని మోదీతో సమావేశమై ఆయన మార్గదర్శకత్వం పొందే అవకాశం లభించింది. ప్రధాని బిజీ షెడ్యూల్ లో కూడా ఈ సమావేశానికి సమయం కేటాయించినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అని పేర్కొన్నారు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పార్టీలో ఇటీవల అంతర్గత సమస్యలు వెలుగులోకి వచ్చి గందరగోళం నెలకున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఉత్తర్ ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీలో ఉన్న విభేదాలపై పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. కేబినెట్ లో మార్పులు కూడా చోటుచేసుకుంటాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీలో ప్రధాని మోదీతో పాటుగా కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ