త్వరలో జరగనున్న ఉత్తరాఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో త్వరలోనే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని, ఎందుకంటే అధికార బీజేపీ ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయారని ప్రియాంక అన్నారు. ఉత్తరాఖండ్లో అసెంబ్లీ ఎన్నికలకు కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీ తరపున ముమ్మరంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. రాష్ట్రంలో ప్రధానమైన నిరుద్యోగ సమస్య గురించి ప్రస్తావిస్తూ అధికార భారతీయ జనతా పార్టీని ఇరుకున పెడుతున్నారు. ఉద్యోగాల కోసం ఉత్తరాఖండ్ నుంచి ప్రజలు ఎందుకు వలసవెళ్లాల్సి వస్తోంది? ఇక్కడ ఉపాధి కల్పన లేదని ప్రియాంక గాంధీ మండిపడ్డారు. ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు, ఉపాధిని పెంచేందుకు ఏం చేయబోతున్నారో ముఖ్యమంత్రి ప్రజలకు చెప్పాలని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో.. సమాజంలోని ప్రతి వర్గానికి చెందిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ ప్రభుత్వంపై ప్రియాంక గాంధీ మండిపడ్డారు. గత ఏడాది వలస వచ్చినవారిని తమ సొంత రాష్ట్రాలకు తిరిగి వచ్చేలా ప్రోత్సహించడం ద్వారా కాంగ్రెస్ COVID-19 ను వ్యాప్తి చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వాదనపై ప్రియాంక కౌంటర్ ఇచ్చారు. ఆ సమయంలో ఎటువంటి సౌకర్యాలు లేకుండా రోడ్లపై తిరుగుతున్న కార్మికులకు తమ పార్టీ సహాయం చేసిందని స్పష్టం చేశారు. వారు రోడ్లపై నడుస్తున్నారు.. వారికి సౌకర్యాలు లేవు. అలాంటప్పుడు మేము వాళ్ళని అలా వదిలేస్తామా? వాళ్ళని ఇంటికి పంపించి మా డ్యూటీ చేశాం. అది మా కర్తవ్యం.. అని ప్రియాంక గాంధీ అన్నారు. ప్రజల ‘మన్ కీ బాత్’ వినడం లేదని ప్రధాని నరేంద్ర మోదీపై కూడా ప్రియాంక గాంధీ వాద్రా విరుచుకుపడ్డారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ