భారతదేశంలోని ప్రజలంతా శతాబ్దాలుగా ఎదురుచూస్తోన్న రామ మందిర నిర్మాణం , విగ్రహ ప్రాణప్రతిష్ఠ తుది ఘట్టానికి చేరుకున్నాయి. మరికొద్దిసేపటిలో బాల రాముడిని ప్రతిష్ఠించే కార్యక్రమాన్ని నభూతో నభవిష్యత్ అన్నంత అట్టహాసంగా నిర్వహించనున్నారు. దీనికోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆలయ నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాలేదు కదా మరి ప్రాణప్రతిష్ఠ తర్వాత జరిగే ప్రణాళిక ఏంటి అనే అనుమానం చాలామంది వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంపై రామమందిర నిర్మాణ కమిటీ స్పందించింది.
జనవరి 23వ తేదీ నుంచే మళ్లీ నిర్మాణ పనులను మొదలు పెడతామని కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా చెప్పుకొచ్చారు. మంచి ముహూర్తం కావడంతోనే జనవరి 22న ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని.. 2024 ముగిసేసరికి నూతన ఉత్సాహంతో ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. రామ ఆలయ ప్రాంగణంలోనే ఇంకా ఏడు ఉపాలయాలు నిర్మించాల్సి ఉందని.. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత వీటిని పూర్తి చేసే పనిని ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు. జనవరి 22 నాటి కార్యక్రమం ఏర్పాట్ల గురించి ఆదివారం మాట్లాడిన నృపేంద్ర మిశ్రా.. భారత దేశానికి ఇచ్చిన హామీని నెరవేర్చేలా ఈ పనులు ఉంటాయని అన్నారు.
జనవరి 16 నుంచి బాల రాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు అయోధ్యలో ప్రారంభమయ్యాయి. బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ సోమవారం అంటే జనవరి 22న మధ్యాహ్నం 12.30 గంటలకు మొదలై ఒంటి గంటకు పూర్తవుతుంది. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం తర్వాత ప్రధాని మోడీ జాతి నుద్దేశించి ప్రసంగించనున్నారు. జనవరి 23 నుంచి రామయ్య దర్శనానికి సాధారణ భక్తులను కూడా అనుమతించనున్నారు.
నగర శైలిలో నిర్మిస్తోన్న అయోధ్యలోని ఈ రామమందిరం 2.7 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. రామ మందిరం 380 అడుగుల పొడవుతో, 250 అడుగుల వెడల్పుతో, 161 అడుగుల ఎత్తుతో నిర్మిస్తున్నారు. ఈ రామాలయంలో మొత్తం 392 స్తంభాలు, 44 ద్వారాలు ఉంటాయి. ఆలయ నిర్మాణానికి ఇప్పటివరకూ సుమారు రూ.1100 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అయితే మొత్తం రామమందిరం పూర్తవడానికి ఇంకో రూ.300 నుంచి రూ.400 కోట్లు అవసరమవుతాయని కమిటీ అంచనా వేస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ