క్రికెట్ ప్రపంచకప్ 2019లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో బౌండరీల లెక్క ప్రకారం ఇంగ్లాండ్ ను విజేతగా ప్రకటించడంతో, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ పై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అనేక మంది క్రికెటర్లు, అభిమానులు సూపర్ ఓవర్ టైగా ముగియడంతో బౌండరీల ప్రకారం విజేతను ప్రకటించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసారు, దీనిపై ఐసీసీ పునరాలోచించాల్సిన అవసరం ఉందని సూచించారు. రెండు జట్ల మధ్య ఫైనల్ ఆధ్యంతం ఆసక్తికరంగా సాగిన కూడ, విజేతను నిర్ణయించిన విధానంపై విమర్శలు రావడంతో ఐసీసీ ఎట్టకేలకు స్పందించింది.
బౌండరీల నిబంధనపై సమీక్ష జరిపేందుకు భారత మాజీ ఆటగాడు, స్పిన్నర్ అనిల్ కుంబ్లే నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఐసీసీ నిర్వహించబోయే తదుపరి సమావేశంలో ఈ నిబంధనపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఐసీసీ జనరల్ మేనేజర్ జియోఫ్ అలార్డెస్ మాట్లాడుతూ, మ్యాచ్ టైగా ముగిస్తే సూపర్ ఓవర్ తో విజేతను నిర్ణయించే పద్ధతిని 2009 నుంచి పాటిస్తున్నాం, సూపర్ ఓవర్ కూడ టైగా ముగిస్తే బౌండరీల ఆధారంగా విజేతను ప్రకటిస్తున్నాం, దాదాపు అన్ని టీ-20 లీగుల్లో కూడ ఇదే పధ్ధతి ఫాలో అవుతున్నారు. ఈ నిబంధనపై అనేక విమర్శలు వచ్చాయి కాబట్టి అనిల్ కుంబ్లే నేతృత్వంలోని కమిటీ అన్ని అంశాలను పరిశీలిస్తుందని తెలిపారు. అంతే కాకుండా టెస్టులను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు ఐసీసీ టెస్టు ఛాంపియన్ షిప్ ప్రవేశ పెడుతుందని, అన్ని దేశాల క్రీడాకారులు మద్ధతు తెలపడం సంతోషంగా ఉందన్నారు.