భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం నూతన ఆల్-ఇండియా సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీ నియామకాలను ప్రకటించింది. చేతన్ శర్మ, శివ సుందర్ దాస్, సుబ్రోతో బెనర్జీ, సలీల్ అంకోలా, శ్రీధరన్ శరత్ లను సెలక్షన్ కమిటీ సభ్యులుగా నియమించారు. కాగా చేతన్ శర్మకే మరోసారి సెలక్షన్ కమిటీ చైర్మన్ గా అవకాశం దక్కింది.
ముందుగా అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపే, సులక్షణ నాయక్ లతో కూడిన ముగ్గురు సభ్యుల క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఆల్-ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ సభ్యులను ఎంపిక చేయడానికి విస్తృతమైన ప్రక్రియను చేపట్టిందని బీసీసీఐ పేర్కొంది. 2022, నవంబర్ 18న సెలక్షన్ కమిటీ కోసం బీసీసీఐ అధికారిక వెబ్సైట్లో ఐదు పోస్టులకై ప్రకటన చేయగా, దాదాపు 600 దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు. తగిన చర్చలు మరియు దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలించిన తరువాత, క్రికెట్ అడ్వైజరీ కమిటీ వ్యక్తిగత ఇంటర్వ్యూల కోసం 11 మంది వ్యక్తులను షార్ట్లిస్ట్ చేసిందని, ఇంటర్వ్యూల ఆధారంగా సీనియర్ పురుషుల నేషనల్ కమిటీకి సభ్యులుగా చేతన్ శర్మ, శివ సుందర్ దాస్, సుబ్రోతో బెనర్జీ, సలీల్ అంకోలా, శ్రీధరన్ శరత్ లను కమిటీ సిఫార్సు చేసిందని బీసీసీఐ ప్రకటించింది. ఇక సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీ చైర్మన్ గా కూడా చేతన్ శర్మనే కమిటీ సిఫార్సు చేసినట్టు బీసీసీఐ తెలిపింది.
టీ20 ప్రపంచకప్-2022లో భారత్ జట్టు పేలవ ప్రదర్శనతో సెమీఫైనల్ లోనే వెనుదిరిగిన నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ ముగిసిన వారం రోజులకే ఆ జట్టును ఎంపిక చేసిన సెలక్షన్ కమిటీపై వేటు వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మతో పాటుగా సెలక్షన్ కమిటీలో మిగతా సభ్యులైన సునీల్ జోషి, హర్విందర్ సింగ్ మరియు దేబాశిష్ మొహంతిపై వేటు పడింది.
అనంతరం వారి స్థానాలను భర్తీచేసేందుకు వెంటనే జాతీయ సెలక్టర్స్ (సీనియర్ మెన్) పోస్టుల భర్తీకి బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ క్రమంలో ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత సెలక్షన్ కమిటీ నియామకాలను బీసీసీఐ తాజాగా ప్రకటించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE