తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా 10 మంది న్యాయమూర్తులు నియమితులయ్యారు. ముందుగా ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం తెలంగాణ హైకోర్టుకు న్యాయమూర్తులుగా(జడ్జిలు) ఏడుగురు న్యాయవాదులు, ఐదుగురు జ్యుడిషియల్ ఆఫీసర్లుతో కలిపి మొత్తం 12 మంది పేర్లను సిఫారసు చేసింది. సిఫారసుల పరిశీలన అనంతరం వీరిలో 10 మంది నియామకాలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేయడంతో, మంగళవారం నాడు కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయమూర్తులుగా నియమితులైన వారిలో న్యాయవాదుల విభాగం నుంచి కాసోజు సురేందర్, సూరేపల్లి నంద, ముమ్మినేని సుధీర్ కుమార్, జువ్వాడి శ్రీదేవి, నాచ్చరాజు శ్రవణ్ కుమార్ వెంకట్ ఉన్నారు.
అలాగే జ్యుడిషియల్ ఆఫీసర్ల విభాగం నుంచి జి.అనుపమ చక్రవర్తి, ఎం.జి. ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, ఎ.సంతోష్ రెడ్డి, డా.డి.నాగార్జున్ ఉన్నారు. తాజాగా 10 మంది న్యాయమూర్తులు నియామకంతో తెలంగాణ హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 29 కు చేరింది. వీరిలో 10 మంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. ఈ పది మంది న్యాయమూర్తులు మార్చి 24, గురువారం నాడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్రశర్మ వీరితో ప్రమాణం చేయించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ