ఏపీ ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్ద నిరసన నేపథ్యంలో.. అసెంబ్లీలో సస్పెండ్ అయిన 11 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈరోజు టీడీపీ ఆధ్వర్యంలో విజయవాడలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్ద నిరసనలకు పిలుపునివ్వడంతో పోలీసులు ముందస్తుగా వారిని గృహనిర్భందం చేశారు. ఇటీవల ఏపీలో జంగారెడ్డిగూడెంలో సంభవించిన మరణాలపై అసెంబ్లీలో చర్చించాలని పట్టుబడుతూ 11 మంది టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్కు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో టీడీపీ ముఖ్యనేతలు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య , బొండా ఉమ, గద్దె రామ్మోహన్, బోడె ప్రసాద్, దేవినేని ఉమను విజయవాడలో గృహ నిర్బంధం చేశారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలతో పాటుగా మరికొందరు రైతు సంఘం నేతలను కూడా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
ఈ నేపథ్యంలో.. టీడీపీ ఎమ్మెల్యేల ఇళ్ల వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న పోలీసులు వారిని బయటకు అడుగుపెట్టకుండా పహారా కాస్తున్నారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ కార్యాలయం వద్ద కూడా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కల్తీసారా తాగి కొంత మంది మృతి చెందారని ఆరోపిస్తూ.. టీడీపీ సభ్యులు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నాటినుంచి సభలో నిరసన తెలుపుతున్నారు. దీనిపై అసెంబ్లీలో చర్చ జరగాలని పట్టుబడుతూ పలుసార్లు స్పీకర్ పోడియం వద్దకు కూడా దూసుకెళ్లారు. అయితే టీడీపీ సభ్యుల ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ విధిస్తున్నారు. కొంతమందిని ఏకంగా సమావేశాలు జరిగే మొత్తం కాలానికి సస్పెన్షన్ చేయటం గమనార్హం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ