తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఎనుముల రేవంత్రెడ్డి తమది ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వమని నిరూపించుకునే దిశగా ఆది నుంచీ అడుగులు వేస్తున్నారు. రేవంత్ పాలనకు సమయం పట్టవచ్చునని భావించిన వారి అంచనాలు తల్లకిందులు చేస్తూ తొలి రోజు నుంచే దూకుడు ప్రదర్శిస్తున్నారు. ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మార్చి అక్కడ ప్రారంభించిన ప్రజాదర్బార్కు ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చారు. సీఎంగా పగ్గాలు స్వీకరించిన మర్నాడే చేపట్టిన ఈ కార్యక్రమంలో తొలిరోజే 3500 మంది తమ వేదనలు వినిపించారు. ఆ కార్యక్రమం గురించి తగిన ప్రచారం కూడా లేనప్పటికీ, ఉదయం ఏడు గంటల నుంచే బారులు తీరిన జనం కనిపించారంటే రాష్ట్రంలో తమ బాధ చెప్పుకునేందుకు ఎవరూ కనిపించక అల్లాడుతున్న అభాగ్యులెందరో అర్థం చేసుకోవచ్చు.
రెండు రోజుల్లోనే దాదాపు 5,500 ఫిర్యాదులు అందాయంటే పరిస్థితి అంచనా వేసుకోవచ్చు. ఫిర్యాదుల్లో పెన్షన్లు, రెవెన్యూ, ఆరోగ్య సమస్యలవంటివి ఉన్నాయి. వీటితోపాటు సొంత ఇంటి కోసం ఎందరో అభ్యర్థనలు చేసుకున్నారు. రాష్ట్రంలో గూడులేని వారి పరిస్థితికి అవి అద్దం పడుతున్నాయి. అయితే.. ఆ తర్వాత ప్రజాదర్బార్ ను ప్రజావాణిగా మార్చి.. వారంలో రెండు రోజులు.. ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. జ్యోతిబా పూలే ప్రజా భవన్లో ప్రజావాణికి వేళలను కూడా నిర్దేశించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించాలని పేర్కొన్నారు. ఉదయం 10 గంటలలోపు చేరుకున్నవారికి అవకాశం ఇవ్వాలన్నారు. వికలాంగులు, మహిళలకు ప్రత్యేక క్యూల ఏర్పాటు చేశారు. ప్రజల సౌకర్యార్థం తాగు నీరు, ఇతర సౌకర్యాలను కల్పించాలని సీఎం ఆదేశించారు. దీనిపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. దీంతో ప్రజావాణికి విపరీతమైన స్పందన వస్తోంది.
ఈ నేపథ్యంలో ఈ శుక్రవారం జరిగిన ప్రజావాణికి కూడా ప్రజలు పోటెత్తారు. ఉదయం 5 గంటలకే ప్రజాభవన్ ముందు క్యూ కట్టారు. ఈ క్యూ తొమ్మిది గంటలకల్లా కిలోమీటరుకుపైగా పెరిగిపోయింది. ఆ తర్వాత అంతకంతకూ ప్రజలు తమ వినతిపత్రాలతో తరలివస్తూనే ఉన్నారు. ‘‘మాది ప్రజా ప్రభుత్వం.. కొనసాగుతున్నది ప్రజల ప్రభుత్వం.. ఈ విషయం చెప్పుకోవడాన్ని మేం గర్వంగా భావిస్తాం’’ అని రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఉభయసభల నుద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలోనే.. ప్రజలు తమ సమస్యల పరిష్కారం ప్రజాభవన్ ను ఆశ్రయించడం ఇక్కడ గమనార్హం. ‘‘ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కృషి చేస్తాం. ప్రజా ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రజావాణి చేపట్టాం. కొత్త ప్రభుత్వం ప్రయాణం ప్రజాసేవకు అంకితం కావాలని కోరుకుంటున్నాను. రైతులు, యువత, మహిళలకు ఈ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పిస్తుంది.’’ అని తమిళి సై పేర్కొన్నారు.
అయితే.. కొత్త సర్కారుపై ఎంతో ఆశతో.. ప్రజా వాణిలో తమ సమస్యలను విన్నవిస్తున్న ప్రజలకు ఎంత వరకు స్వాంతన చేకూరుతుందో చూడాలి. ప్రజావాణిలో వచ్చిన సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ రూపకల్పనలో ప్రభుత్వం ఉంది. అర్జీలు అన్నింటికీ ఒక్కో నెంబర్ కేటాయిస్తూ.. బాధితులకు సమాచారం ఇస్తున్నారు. ప్రజావాణిలో ఎక్కువగా భూముల సంబంధిత సమ్యలు, ధరణి, ఆరోగ్యం,నిరుద్యోగం అంశాలపైనే ఎక్కువ అర్జీలు వస్తున్నట్లు తెలుస్తోంది. వీటి పరిష్కారానికి ముందడుగు పడాల్సి ఉంది. ఏ రోజు ఎన్ని దరఖాస్తులు వచ్చాయనే వివరాలతో పాటు.. పరిష్కరించిన సమస్యలను కూడా తెలియజేయడం ద్వారా ఈ కార్యక్రమంపై నమ్మకం ఉంటుంది. ప్రజా ప్రభుత్వంలో ప్రజా ‘‘వాణి’’కి ఎంత విలువ ఉందో తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE