కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి 11 క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను విరాళంగా ఇస్తామని మెయిల్ (మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ లిమిటెడ్) హామీ ఇచ్చిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. బ్యాంకాక్ నుండి IL.76 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా వచ్చిన 3 క్రయోజెనిక్ ట్యాంకర్లను స్వీకరించి, ఆక్సిజన్ నింపడానికి ఒడిశాకు రైలులో వెళ్లే ట్యాంకర్లకు బేగంపేట వైమానిక దళం స్టేషన్ వద్ద శనివారం నాడు సీఎస్ సోమేశ్ కుమార్ ఫ్లాగ్ అఫ్ చేశారు.
మొదటి బ్యాచ్గా 3 ట్యాంకర్లు హైదరాబాద్కు వచ్చాయని, బంగాళాఖాతంలో అవాంతరాలు ఉన్నందున మిగిలిన ట్యాంకర్లు 3 నుండి 4 రోజుల్లో వస్తాయని సీఎస్ తెలిపారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సూచనల మేరకు, రాష్ట్రంలోని కోవిడ్ రోగులకు ఎటువంటి కొరత లేకుండా తగురీతిలో ఆక్సిజన్ సరఫరా కోసం, అలాగే కోవిడ్ వ్యాప్తి నివారణకు అందరు అధికారులు నిరంతరం అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలోని కోవిడ్ రోగులకు ఆక్సిజన్ సరఫరా చేయడానికి ఆక్సిజన్ ప్లాంట్లు, స్టోరేజ్ యూనిట్ల నిర్మాణం, ట్యాంకర్ల సేకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రవాణా, రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, రవాణా శాఖ కమీషనర్ యం.ఆర్.యం. రావు, మెయిల్ శ్రీనివాస్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ