తెలంగాణలో పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఈ వ్యవహారంలో నిన్న అర్ధరాత్రి నాటకీయ పరిణామాల మధ్య కరీంనగర్లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ను పోలీసులు అరెస్టు చేయడం మరింత వేడిని రగిల్చింది. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం బండి సంజయ్ అరెస్ట్ వ్యవహారంపై దృష్టి సారించింది. రాష్ట్రంలో అసలేం జరుగుతోందని స్థానిక నేతలను ఆరా తీసింది. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా.. కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ సీనియర్ నేత జి. కిషన్ రెడ్డికి ఫోన్ చేశారు. బండి సంజయ్ అరెస్ట్ వ్యవహారంపై సమాచారం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అమిత్ షా పార్టీ లీగల్ సెల్ నేతృత్వంలో న్యాయ సలహాలతో దీనిపై ముందుకు వెళ్లాలని కిషన్ రెడ్డికి సూచించినట్లు తెలుస్తోంది.
అలాగే మరోవైపు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకు ఫోన్ చేసి ఘటనపై ఆరా తీశారు. సంజయ్ అరెస్ట్ నేపథ్యంలో న్యాయపరమైన అవకాశాలను పరిశీలించాల్సిందిగా రాష్ట్ర నాయకులకు సూచనలిచ్చారు. కాగా బండి సంజయ్ అరెస్ట్ నేపథ్యంలో.. ప్రధాని మోదీతో అమిత్ షా, జేపీ నడ్డా భేటీ అయినట్లు తెలుస్తోంది. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై సేకరించిన వివరాలను వారు ప్రధానికి వివరించినట్లు సమాచారం. అలాగే ప్రధాని మోదీతో భేటీ అనంతరం అమిత్ షా, నడ్డాలు విడిగా సమావేశమై ఈ వ్యవహారంలో తదుపరి తీసుకోవాల్సిన చర్యలు, వ్యూహాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఏదేమైనా బీజేపీ-బీఆర్ఎస్ రాజకీయ పోరాటం మున్ముందు ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE