తెలంగాణ రాష్ట్రంలో 57 సంవత్సరాలు దాటిన అర్హులందరికీ ఆసరా పథకం క్రింద పించన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. “రాష్ట్రంలో 57 సంవత్సరాలు దాటిన అర్హులందరికీ ఆసరా పథకం క్రింద పించన్లు ఇస్తామని అనేకసార్లు స్వయంగా ప్రకటించారు. 2018 ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆసరాపించన్ల వయోపరిమితిని 65-57 సంవత్సరాలకు తగ్గించనున్నట్లు హామీ ఇచ్చారు. ప్రభుత్వ ప్రకటనతో అర్హులైన దాదాపు 11 లక్షలమంది కొత్త ఆసరా పించన్లు కోసం ఏళ్ళతరబడి నిరీక్షిస్తున్నారు. ఏప్రిల్ 1 నుండి కొత్త పించన్లు ఇస్తామని ఆర్భాటపు ప్రకటనలు చేసిన ప్రభుత్వం అందుకు తగ్గకసరత్తు ప్రారంభించకపోవడం శోచనీయం. కొత్త పించన్ల ధరఖాస్తుల స్వీకరణకు అవసరమైన మార్గదర్శకాలను సైతం విడుదల చేయకపోవడంతో ఆసరా పించన్లపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తోంది. రాష్ట్రంలో సుమారు 39 లక్షల మంది ఆసరా పించనుదారులు ఉండగా దాదాపు కొత్తపించన్ల కోసం 11 లక్షల దరఖాస్తులు ప్రభుత్వానికి వచ్చాయి.” అని అన్నారు.
“తమకు వెంటనే పించను అందించి ఆదుకోవాలని దరఖాస్తుదారులంతా ఏళ్ళతరబడి అధికారపార్టీ నాయకులు, అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆసరా పథకం అంటేనే ఆర్థికంగా చితికిపోయిన పేదలకు ఉద్దేశించింది. కుటుంబంలో ఆసరా పథకం పించను పొందే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబంలో అర్హులుంటే ఆ పించను కొనసాగించాలి. అలా కాకుండా ఒక కుటుంబానికి ఒకే పించను అని నిర్ణయించడం అన్యాయం. ఇది ముమ్మాటికి వృద్ధాప్యంలో ఉన్న పేదవారి ఉసురుగొట్టుకొనే చర్యే. ప్రభుత్వ ఈ అనాలోచిత చర్యవల్ల రెండు లక్షల మందికి పైగా ఆసరా పించనుకు దూరమయ్యారు. 2018 డిసెంబర్ లో ఇచ్చిన హామీ ఇప్పటి వరకు అమలు కాకపోవటంతో గడిచిన 39 నెలల్లో ఒక్కో ఆసరా పించను లబ్ధిదారులకి ప్రభుత్వం రూ.78,624 లు బకాయి పడింది. ఈ బకాయిపడ్డ సొమ్మును వృద్ధులకు చెల్లించాలని రాష్ట్రప్రభుత్వాన్ని బీజేపీ తెలంగాణ శాఖ డిమాండ్ చేస్తోంది. ఆసరా పథకం అందుకుంటున్న వ్యక్తి మృతిచెందితే ఆ కుటుంబంలో అర్హులుంటే పించను కొనసాగించడం లేకపోతే మరొక అర్హులైన వారికి పించను ఇవ్వడం నిరంతర ప్రక్రియగా జరగాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. వయోపరిమితి సడలింపు వలన కొత్త లబ్ధిదారుల సంఖ్య పెరగనున్నందున దానికి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు చేయాలని, ఆసరాపించన్ల కొత్త దరఖాస్తుల పరిశీలనకు అవసరమైన మార్గదర్శకాలు వెంటనే విడుదల చేసి అర్హులైన వారందరికీ ఆసరా పించన్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్రశాఖ డిమాండ్ చేస్తోంది” అని అని బండి సంజయ్ సీఎం కేసీఆర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ